Virat Kohli : కోహ్లీకి కోపం వస్తే అంతే.. సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు.. అసలు ఏం జరిగిందంటే?

Virat Kohli : విరాట్ కోహ్లీ గురించి సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ విమర్శలను అస్సలు తట్టుకోలేడని, బయట జరిగే చర్చలన్నీ వింటాడని మంజ్రేకర్ వెల్లడించారు. ఒకప్పుడు కెప్టెన్‌గా ఉన్న సమయంలో విరాట్ కోహ్లీ ప్రవర్తన గురించి ఒక ఉదాహరణ చెప్పారు.

Virat Kohli : కోహ్లీకి కోపం వస్తే అంతే.. సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు.. అసలు ఏం జరిగిందంటే?
Virat Kohli

Updated on: May 12, 2026 | 9:41 AM

Virat Kohli : భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో మనందరికీ తెలిసిందే. అయితే బయట వినిపించే విమర్శల పట్ల కోహ్లీ చాలా సున్నితంగా ఉంటాడని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా కోహ్లీ మీడియా ముందుకు వచ్చినప్పుడు.. “నేను బయట జరిగే చర్చలను పట్టించుకోను, విమర్శలు అస్సలే విననని చెబుతుంటాడు. కానీ మంజ్రేకర్ మాత్రం కోహ్లీకి తన గురించి ఎక్కడ ఎవరు ఏం మాట్లాడుతున్నారో అన్నీ తెలుస్తాయని, ఆ విమర్శలను అతను మనసులోకి తీసుకుంటాడని బాంబు పేల్చారు.

ఒకప్పుడు కెప్టెన్‌గా ఉన్న సమయంలో విరాట్ కోహ్లీ ప్రవర్తన గురించి మంజ్రేకర్ ఒక ఉదాహరణ చెప్పారు. “నేను కోహ్లీ గురించి ఏదైనా విమర్శిస్తూ మాట్లాడితే.. మరుసటి మ్యాచ్‌లో టాస్ వేసే సమయంలో నా పట్ల అతను చాలా కోపంగా ఉండేవాడు. అప్పుడు నాకు అర్థమయ్యేది.. బహుశా నేను అన్న మాటలు కోహ్లీ దాకా వెళ్లాయని” అని మంజ్రేకర్ వివరించారు. కోహ్లీ బయటి ప్రపంచంతో సంబంధం లేనట్లు కనిపించినా, లోలోపల మాత్రం అన్నింటినీ గమనిస్తూనే ఉంటాడని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే ఈ విమర్శల వల్ల కోహ్లీ కుంగిపోడని, అది అతనికి ఒక స్ఫూర్తిలా పనిచేస్తుందని మంజ్రేకర్ చెప్పుకొచ్చారు. “ఎవరైనా తన గురించి తప్పుగా మాట్లాడితే లేదా తన ఫామ్ గురించి విమర్శిస్తే.. దానిని సవాలుగా తీసుకుని తదుపరి మ్యాచ్‌లోనే భారీ సెంచరీ బాదడానికి కోహ్లీ ప్రయత్నిస్తాడు. ఆ కసి అతన్ని మరింత మెరుగ్గా ఆడేలా చేస్తుంది” అని కొనియాడారు. విమర్శలనే తన విజయానికి మెట్లుగా మార్చుకోవడం విరాట్ ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు.

ఐపీఎల్ 2026లో కోహ్లీ పరిస్థితి ఏంటి?

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్‌లో విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున అద్భుతంగా మొదలుపెట్టాడు. కానీ, గత రెండు మ్యాచ్‌లలో మాత్రం కోహ్లీ వరుసగా డకౌట్ (సున్నా పరుగులు) అయి ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లలో విరాట్ విఫలం కావడంతో మళ్ళీ విమర్శలు మొదలయ్యాయి. ఈ విమర్శల నేపథ్యంలో మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఫ్యాన్స్ ఆశలు అడియాసలేనా?

విరాట్ కోహ్లీ గతేడాది టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 37 ఏళ్ల కోహ్లీ టెస్టుల్లో 10,000 పరుగుల మార్కును అందుకోవాలని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకున్నారు. అయితే, ఇంగ్లాండ్ పర్యటనకు ముందే అతను టెస్టుల నుంచి తప్పుకున్నాడు. కోహ్లీ గైర్హాజరీలో టీమిండియా టెస్ట్ జట్టులో ఆ అగ్రెసివ్ ఫీల్ తగ్గుతోందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. కోహ్లీ కెప్టెన్సీలో ప్రతి ఆటగాడు విరాట్‌లాగే అగ్రెసివ్‌గా ఉండాలని, లేకపోతే తర్వాతి మ్యాచ్‌లో ఉండేవారు కాదని ఆయన గుర్తు చేసుకున్నారు. ఫ్యాన్స్ మళ్ళీ టెస్టుల్లోకి రావాలని కోరుతున్నా.. కోహ్లీ మాత్రం తన నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us