IND vs AFG: భారత్ – ఆఫ్ఘన్ తొలి టీ20 మ్యాచ్లో జనగణమనకు ముందే వందేమాతరం ఎందుకు ఆలపించారు?
IND vs AFG: భారత్ - ఆఫ్ఘన్ తొలి టీ20 మ్యాచ్కు ముందు జనగణమనకు ముందుగా వందేమాతరం ఆలపించడం ఆసక్తికరంగా మారింది. వందేమాతరం 150 ఏళ్ల వేడుకల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త ప్రోటోకాల్ ప్రకారం ఈ క్రమాన్ని అమలు చేసినట్లు సమాచారం. అరుణ్ జైట్లీ స్టేడియంలో బీసీసీఐ ఈ విధానాన్ని అమలు చేయడంతో సోషల్ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

IND vs AFG: ఢిల్లీలోని ప్రఖ్యాత అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ అట్టహాసంగా ప్రారంభమైంది. భారత్ – ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య ప్రారంభమైన ఈ మూడు మ్యాచ్ల సిరీస్లోని తొలి పోరులో మ్యాచ్ ఆరంభానికి ముందు మైదానంలో ఒక ప్రత్యేక వాతావరణం నెలకొంది. ఇరు దేశాల ఆటగాళ్ళు మైదానంలో నిలబడి ఉండగా, ముందుగా దేశ జాతీయ గేయమైన వందేమాతరం ఆలపించారు. ఆ తర్వాత యథావిధిగా 52 సెకన్ల పాటు జనగణమన జాతీయ గీతం ఆలపించారు. ఈ కొత్త సీక్వెన్స్ను చూసిన అభిమానులు ఆశ్చర్యపోవడంతో పాటు సోషల్ మీడియాలో దీనిపై రకరకాల చర్చలు ప్రారంభించారు.
జాతీయ గీతానికి ముందే వందేమాతరం ఆలపించడానికి గల అసలు కారణం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సరికొత్త అధికారిక నిబంధనలే. జాతీయ గీతాలు, దేశీయ కార్యక్రమాల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం ఎక్కడైనా జాతీయ గీతం, జాతీయ గేయం రెండూ ఒకే వేదికపై ప్రదర్శించాల్సి వస్తే, ముందుగా వందేమాతరం పూర్తి రూపాన్ని ఆలపించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఆమోదించబడిన ఆరు చరణాల వందేమాతరం గీతాన్ని 3 నిమిషాల 10 సెకన్ల పాటు ప్రదర్శించారు.
Vande matram full played before the national anthem 🇮🇳❤️ #indvsafg https://t.co/ZnqibhCy4V
— Abhay SS Jain 🇮🇳 (@Abhay8042) September 13, 2026
వందేమాతరం గేయం ఉనికిలోకి వచ్చి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తోంది. నవంబర్ 7, 2025 నుంచి నవంబర్ 7, 2026 వరకు ఏడాది పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే అధికారిక ప్రభుత్వ కార్యక్రమాలు, రాష్ట్రపతి పాల్గొనే సభలు, పౌర సన్మానాలతో పాటు ప్రతిష్టాత్మక క్రీడా వేదికలపై కూడా ఈ కొత్త ప్రోటోకాల్ను ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీనికి అనుగుణంగానే బీసీసీఐ ఈ మ్యాచ్లో ఈ నిబంధనను పకడ్బందీగా అమలు చేసింది.
మైదానంలో తొలిసారిగా ఈ విధానాన్ని చూసిన క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు నెటిజన్లు దీనిని పీక్ డీటైలింగ్ అంటూ కొనియాడగా, మరికొందరు క్రీడా వేదికలపై ఇలాంటి నిబంధనలు అవసరమా అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, కొత్త ప్రోటోకాల్ ప్రకారం మ్యాచ్ ప్రారంభం కావడం క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు మొదటి టీ20లో ఘన విజయం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
