
Vaibhav Suryavanshi : క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న బుడతడు, వైభవ్ సూర్యవంశీ మరో మైలురాయిని చేరుకోబోతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి సరిగ్గా ఒక్క రోజు ముందు, అంటే మార్చి 27న వైభవ్ తన 15వ పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు. గతేడాది 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ బీహార్ కుర్రాడు, ఇప్పుడు 15వ ఏట అడుగుపెడుతూ మరింత జోరు చూపించడానికి సిద్ధమయ్యాడు. ఐపీఎల్ 2026 ప్రారంభ వేడుకలకు ముందే వైభవ్ బర్త్డే హంగామా మొదలుకాబోతోంది.
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తన మొదటి మ్యాచ్ను మార్చి 30న చెన్నై సూపర్ కింగ్స్తో ఆడనుంది. ఈ పోరు గౌహతిలోని బర్సాపరా స్టేడియంలో జరగనుంది. రాజస్థాన్ రాయల్స్కు ఇది రెండో హోమ్ గ్రౌండ్ కావడంతో జట్టు సభ్యులందరూ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. వైభవ్ సూర్యవంశీ కూడా టీమ్తోనే ఉన్నాడు. దీంతో తన 15వ పుట్టినరోజు వేడుకలు తన జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ సొంత ఊరైన గౌహతిలోనే జరగనున్నాయి. వరుసగా రెండో ఏడాది వైభవ్ తన పుట్టినరోజును ఐపీఎల్ ఫ్రాంచైజీతో జరుపుకోవడం విశేషం. గతేడాది 14వ పుట్టినరోజును జరుపుకున్న తర్వాతే అతను ఐపీఎల్ బరిలోకి దిగాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్తో ప్రపంచాన్ని మెప్పించాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున 7 మ్యాచ్లు ఆడిన వైభవ్, ఏకంగా 252 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 200 కంటే ఎక్కువగా ఉండటం విశేషం. కేవలం 14 ఏళ్ల వయసులో 35 బంతుల్లోనే సెంచరీ బాది, మురళీ విజయ్ వంటి దిగ్గజాల రికార్డులను సమం చేశాడు. అప్పట్లో వైభవ్ బ్యాటింగ్ చూసిన దిగ్గజ క్రికెటర్లు సైతం షాక్ అయ్యారు. 14 ఏళ్లకే అంత పవర్ హిట్టింగ్ చేయడం మామూలు విషయం కాదని ప్రశంసలు కురిపించారు.
15వ పుట్టినరోజు సందర్భంగా వైభవ్ తన లక్ష్యాలను వెల్లడించాడు. ఈసారి రాజస్థాన్ రాయల్స్కు ఐపీఎల్ టైటిల్ అందించడమే తన ప్రధాన ఉద్దేశమని చెప్పాడు. అంతేకాదు, ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గైల్ నెలకొల్పిన 175 పరుగుల రికార్డును బద్దలు కొట్టాలనే బలమైన కోరికను కూడా వైభవ్ తన మనసులో ఉంచుకున్నాడు. తన బ్యాటింగ్ శైలిని మరింత మెరుగుపరుచుకుంటూ, ఈ సీజన్లో మరిన్ని రికార్డులను నెలకొల్పడానికి కఠినంగా శ్రమిస్తున్నాడు. మార్చి 30న జరిగే తొలి మ్యాచ్లోనే ధోనీ సేనపై అదిరిపోయే ప్రదర్శన చేయాలని వైభవ్ ఉవ్విళ్లూరుతున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ జట్టులో ప్రస్తుతం వైభవ్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. టీమ్ మెంటార్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో వైభవ్ తన ఆటను మెరుగుపరుచుకుంటున్నాడు. రియాన్ పరాగ్ వంటి యువ కెప్టెన్ తోడుండటంతో వైభవ్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు. బర్త్డే వేడుకల అనంతరం వైభవ్ తిరిగి నెట్స్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. ఒకవైపు ఐపీఎల్ ప్రారంభం, మరోవైపు చిన్నోడి బర్త్డే కావడంతో రాజస్థాన్ క్యాంప్లో పండగ వాతావరణం నెలకొంది. ఈసారి వైభవ్ తన బ్యాట్తో ఏ రకమైన మ్యాజిక్ చేస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..