Vaibhav Sooryavanshi : తొలి మ్యాచ్లో నిరాశపరిచినా తగ్గేదేలే.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టిన వైభవ్
Vaibhav Sooryavanshi : భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో టీ20 అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ తొలి మ్యాచ్లో 14 పరుగులకే అవుటైనా, దేశానికి ఆడటం జీవితకాల కల నెరవేరిందని ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అభిమానులు, సీనియర్ల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపాడు.

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ చరిత్రలో జూలై 4 శనివారం ఒక సరికొత్త మైలురాయిగా నిలిచిపోయింది. టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా 15 ఏళ్ల యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డు సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల 99 రోజుల వయసులోనే భారత్కు ప్రాతినిధ్యం వహించడం ద్వారా, గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న సుదీర్ఘకాలపు రికార్డును ఈ బీహార్ కుర్రాడు బద్దలు కొట్టాడు. లండన్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ స్థానంలో వైభవ్కు తుది జట్టులో అవకాశం లభించింది.
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున వైభవ్ సూర్యవంశీ డ్రీమ్ రన్ కొనసాగించాడు. ఆ సీజన్లో ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకోవడమే కాకుండా, ఐపీఎల్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ అద్భుత ప్రదర్శనతోనే అతనికి భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది. అయితే ఐర్లాండ్ పర్యటనతో పాటు ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టీ20లోనూ బెంచ్కే పరిమితమైన వైభవ్ నిరీక్షణ ఎట్టకేలకు రెండో టీ20తో ముగిసింది. భారత్ తరఫున 122వ నంబర్ టీ20 క్యాప్ను అందుకుని మైదానంలోకి అడుగుపెట్టాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ తరఫున అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. ఇంగ్లాండ్ స్పీడ్ స్టర్లు జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ తమ వేగంతో, బౌన్స్తో ఈ 15 ఏళ్ల కుర్రాడిని ఆరంభంలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కొద్దిగా తడబడినా కూడా వైభవ్ తన అటాకింగ్ మైండ్సెట్ను వదల్లేదు. ఆర్చర్ వేసిన ఒక బంతిని అద్భుతమైన స్కూప్ షాట్ ద్వారా ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్గా మలిచి అంతర్జాతీయ క్రికెట్లో తన మొదటి పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. ఆ వెంటనే జోష్ టంగ్ ఓవర్లో మిడ్వికెట్ మీదుగా మరో భారీ సిక్సర్ బాదాడు. అయితే విల్ జాక్స్ వేసిన నెమ్మదైన బంతిని భారీ షాట్ ఆడబోయి స్టంప్ అవుట్ అయ్యాడు. దీంతో అతని తొలి ఇన్నింగ్స్ 10 బంతుల్లో 2 సిక్సర్లతో 14 పరుగుల వద్ద ముగిసింది.
మొదటి మ్యాచ్లో పెద్ద స్కోరు చేయలేకపోయినప్పటికీ, దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే తన జీవితకాల కల నెరవేరడం పట్ల వైభవ్ ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అభిమానులకు, సీనియర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగమైన పోస్ట్ పెట్టాడు. “మనమందరం కలిసి కన్న ఒక కలను నేను ఇప్పుడు జీవిస్తున్నాను. నా హెచ్చుతగ్గుల్లో నాకు అండగా ఉంటూ, నన్ను నిరంతరం ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. దేశానికి ఆడటం నాకెంతో గర్వంగా ఉంది” అంటూ తన క్యాప్ నంబర్ #122 హాష్ ట్యాగ్ను షేర్ చేశాడు.
View this post on Instagram
తొలి మ్యాచ్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా.. సీనియర్ ఆటగాళ్లు, అభిమానులు తనకు అండగా నిలవడంపై వైభవ్ సూర్యవంశీ హర్షం వ్యక్తం చేశాడు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో స్పందిస్తూ.. “అభిమానులు పంపుతున్న మెసేజ్లు చూసి నా మనసు నిండిపోయింది. నా శ్రేయోభిలాషులు, టీమ్లోని సీనియర్ ఆటగాళ్లు చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం నా అదృష్టం. రాబోయే రోజుల్లో ప్రతి మ్యాచ్లోనూ నా జట్టు విజయం కోసం వంద శాతం శ్రమిస్తాను” అని రాసుకొచ్చాడు.
ప్రస్తుతం మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో ఉండటంతో, జూలై 7న జరగబోయే మూడో టీ20 మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. వైభవ్ తన మొదటి మ్యాచ్లో పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయినప్పటికీ, క్రీజులో అతను చూపించిన భయం లేని ఆటతీరు, పాజిటివ్ అప్రోచ్ టీమ్ మేనేజ్మెంట్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అతని వయసు, అసాధారణ ప్రతిభను దృష్టిలో ఉంచుకుని మేనేజ్మెంట్ మూడో మ్యాచ్లోనూ అతనికి అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ నెక్స్ట్ మ్యాచ్లో అవకాశం వస్తే, తనపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తూ భారీ ఇన్నింగ్స్తో పునరాగమనం చేయాలని వైభవ్ పట్టుదలతో ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
