
India Next T20 Captain: భారత క్రికెట్ జట్టులో త్వరలోనే ఒక సంచలన మార్పు చోటుచేసుకోబోతోందా? టీ20 ఫార్మాట్లో సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోవడం, మన తెలుగు రాష్ట్రాల గర్వకారణం, యువ సంచలనం తిలక్ వర్మకు టీమిండియా పగ్గాలు అప్పగించేందుకు మార్గం సుగమం చేస్తోందా? సెలెక్టర్ల ఆలోచనలు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటరే భారత సరికొత్త కెప్టెన్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుత భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. నిలకడలేని ఫామ్తో అతను ఇబ్బంది పడుతుండటంతో, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సరికొత్త నాయకుడిని వెతికే పనిలో పడ్డారు సెలెక్టర్లు. ఈ క్రమంలోనే అందరి దృష్టి కేవలం 23 ఏళ్ల వయసున్న హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మపై పడింది. ఐపీఎల్లోనూ, అంతర్జాతీయ మ్యాచ్ల్లోనూ ఒత్తిడిని అధిగమించి ఆడే తత్వం ఉన్న తిలక్ అయితేనే జట్టును సమర్థవంతంగా నడిపించగలడని మేనేజ్మెంట్ గట్టిగా నమ్ముతోంది.
ఇది కూడా చదవండి: కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి..? వీరిద్దరి ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే అవాక్కే..
భారత సీనియర్ జట్టుకు నాయకత్వం వహించే ముందు తిలక్ వర్మ నాయకత్వ నైపుణ్యాలను పరీక్షించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగబోయే ముక్కోణపు ‘ఎ’ సిరీస్ కోసం భారత జట్టుకు తిలక్ వర్మను కెప్టెన్గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో అతను జట్టును ఎలా నడిపిస్తాడు, ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాడనే అంశాల ఆధారంగానే అతని భవిష్యత్తు కెప్టెన్సీ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఈ పరీక్షలో తిలక్ ఉత్తీర్ణుడైతే, నేరుగా భారత ప్రధాన జట్టు పగ్గాలు అందుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
భారత రాబోయే కెప్టెన్ రేసులో కేవలం తిలక్ వర్మ మాత్రమే లేడు. సీనియర్ ఆటగాళ్లు సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్ లాంటి అనుభవజ్ఞులు కూడా పోటీలో ఉన్నారు. అయితే, వీరిద్దరితో పోలిస్తే తిలక్ వర్మకు వయసు కలిసివచ్చే అంశం. సుదీర్ఘ కాలం పాటు జట్టును నడిపించగల సత్తా, నిలకడైన ఆటతీరు అతని సొంతం. అంతేకాకుండా, మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉంటూ నిర్ణయాలు తీసుకునే గుణం ఉండటం వల్లే సెలెక్టర్లు మిగతా వారికంటే ఈ తెలుగు కుర్రాడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Video: తూచ్.. వాడిదసలు బౌలింగేనా.. స్టాండ్స్లో శివాలెత్తిన కావ్యపాప..
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..