Video: ఔటా.. నాటౌటా? తిలక్ వర్మ వివాదాస్పద వికెట్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..!

Tilak Varma Stumping Controversy: సాంకేతిక ఆధారాలతో అంపైర్ నిర్ణయం సరైనదేనని తేలినప్పటికీ, ఇంగ్లాండ్ కీపర్ బట్లర్ చాకచక్యం భారత్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ఘోర ఓటమితో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లగా, ప్రపంచ ఛాంపియన్ హోదాలో ఉన్న టీమిండియా తన తదుపరి మ్యాచ్‌ల్లోనైనా పరువు నిలబెట్టుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Video: ఔటా.. నాటౌటా? తిలక్ వర్మ వివాదాస్పద వికెట్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..!
Tilak Varma Controversy Stumping Dismissal

Updated on: Jul 08, 2026 | 8:07 AM

Tilak Varma Stumping Controversy: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ అవుటైన తీరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశమైంది. అంపైర్ నిర్ణయంపై సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో ఈ వివాదం కాస్తా పెద్దదిగా మారింది.

నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో ఇంగ్లాండ్ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ అవుటైన విధానం సరికొత్త వివాదానికి దారితీసింది. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేసిన స్టంపింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ అభిమానులు సోషల్ మీడియాలో అంపైర్లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మైదానంలో అసలేం జరిగిందంటే?

భారత జట్టు కేవలం పవర్‌ప్లే లోనే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో తిలక్ వర్మ క్రీజులోకి వచ్చారు. ఇంగ్లాండ్ స్పిన్నర్ విల్ జాక్స్ వేసిన ఒక వేగవంతమైన బంతిని భారీ షాట్ ఆడటానికి తిలక్ క్రీజు వదిలి ముందుకు వచ్చారు. అయితే బంతి వేగాన్ని అంచనా వేయడంలో విఫలం కావడంతో అది బ్యాట్‌కు దొరకకుండా నేరుగా వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతుల్లోకి వెళ్ళింది. తిలక్ క్రీజు వెలుపల ఉండటాన్ని గమనించిన బట్లర్ వెంటనే వికెట్లను పడగొట్టాడు.

ఇది కూడా చదవండి: టాస్‌లో హీరో.. మ్యాచ్‌లో జీరో.. టీమిండియా పాలిట విలన్‌లా మారిన శ్రేయాస్ అయ్యర్..!

అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకుంది. బట్లర్ వికెట్లను పడగొట్టిన మరుక్షణమే బంతి అతని గ్లోవ్స్ నుంచి జారి కిందపడిపోయింది. దీంతో తిలక్ వర్మ నాటౌట్ అంటూ నెటిజన్లు రచ్చ చేయడం ప్రారంభించారు. కానీ రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ మాత్రం తిలక్‌ను అవుట్‌గా ప్రకటించారు. కేవలం 11 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసి వైస్ కెప్టెన్ నిరాశగా వెనుతిరిగారు.

ఐసీసీ, ఎంసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఈ వివాదంపై స్పష్టత రావాలంటే క్రికెట్ చట్టాలను రూపొందించే ఎంసీసీ (MCC Law) నిబంధనలను పరిశీలించాల్సి ఉంటుంది. ఈ నియమం ప్రకారం:

ఒక వికెట్‌ను పడగొట్టే సమయంలో ఫీల్డర్ లేదా వికెట్ కీపర్ బంతిపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి.

వికెట్లను పడగొట్టే ఆ ‘ఖచ్చితమైన క్షణంలో’ బంతి కీపర్ చేతికి లేదా గ్లోవ్స్‌కు తగులుతూ ఉంటే ఆ అవుట్ పూర్తిగా చెల్లుతుంది.

వికెట్లు పడిపోయిన తర్వాత (బైల్స్ గాల్లోకి లేచిన తర్వాత) బంతి చేతిలోంచి జారినా సరే, అది అవుట్‌గానే పరిగణించబడుతుంది.

తిలక్ వర్మ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. జోస్ బట్లర్ వికెట్లను తాకే సమయానికి బంతి అతని వేలికొనలకు తగులుతూనే ఉంది. వికెట్లు పూర్తిగా పడిపోయిన తర్వాతే బంతి కిందపడింది. ఆ సమయంలో తిలక్ అడుగు క్రీజు బయటే ఉంది కాబట్టి అంపైర్ ఇచ్చిన నిర్ణయం నూటికి నూరు పాళ్ళు సరైనదే.

ఇది కూడా చదవండి: ఏమిరా శ్రేయాస్.. టీమిండియా హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డు.. పరువు తీసేశావుగా..!

భారత్ ఘోర పరాజయం..

తిలక్ వర్మ వికెట్ పడటంతో భారత జట్టు గెలుపు ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి. 60 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆ తర్వాత కనీసం పోరాట పటిమ కూడా చూపించలేకపోయింది. హర్షిత్ రాణా, శివం దూబే, అర్ష్‌దీప్ సింగ్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కేవలం 5 ఓవర్ల వ్యవధిలోనే భారత్ 52/5 నుంచి 70/9 కి పడిపోయింది. ఇంగ్లాండ్ బౌలర్ జోష్ టంగ్ 28 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, జొఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్ కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయి, 125 పరుగుల ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us