IND vs PAK : శత్రుత్వం కాదు..అదో డ్రామా..భారత్-పాక్ ‘నో షేక్హ్యాండ్’ వెనుక అసలు నిజం ఇదీ..ఇంగ్లాండ్ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
IND vs PAK : టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అనగానే కేవలం ఫోర్లు, సిక్సర్ల గురించే కాదు.. మైదానంలో ఆటగాళ్ల మధ్య ఉన్న దూరం గురించి కూడా చర్చ జరుగుతోంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా ఏకపక్షంగా విజయం సాధించినప్పటికీ, మ్యాచ్ ముగిశాక ఇరు జట్ల ఆటగాళ్లు కనీసం షేక్హ్యాండ్ కూడా ఇచ్చుకోకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

IND vs PAK : టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అనగానే కేవలం ఫోర్లు, సిక్సర్ల గురించే కాదు.. మైదానంలో ఆటగాళ్ల మధ్య ఉన్న దూరం గురించి కూడా చర్చ జరుగుతోంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా ఏకపక్షంగా విజయం సాధించినప్పటికీ, మ్యాచ్ ముగిశాక ఇరు జట్ల ఆటగాళ్లు కనీసం షేక్హ్యాండ్ కూడా ఇచ్చుకోకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో కానీ, మ్యాచ్ తర్వాత కానీ పాక్ కెప్టెన్తో కరచాలనం చేయలేదు. ఈ నో-హ్యాండ్షేక్ వివాదంపై ఇంగ్లాండ్ మాజీ దిగ్గజం అలిస్టర్ కుక్ స్పందిస్తూ సంచలన విషయాలు బయటపెట్టారు.
అలిస్టర్ కుక్ తాజాగా ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. మైదానంలో ఆటగాళ్లు ఒకరికొకరు దూరంగా ఉండటం కేవలం లోకానికి చూపే షాడో బాక్సింగ్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. “బయట ప్రపంచానికి గంభీరంగా కనిపిస్తున్న ఈ ఆటగాళ్లు, లోపల మూసి ఉన్న గదుల్లో మాత్రం సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారని నేను విన్నాను. బయట చేతులు కలపకపోవడం అంతా ఒక డ్రామా లాగా అనిపిస్తోంది. డ్రెస్సింగ్ రూమ్ వెనుక తలుపులు మూశాక వాళ్లంతా స్నేహంగానే ఉంటున్నారు, అంతా బానే ఉంది” అని కుక్ పేర్కొన్నారు. ఈ చర్చలో పాల్గొన్న మైఖేల్ వాన్ వంటి మాజీలు కూడా క్రికెట్ మైదానంలో ఇలాంటి పద్ధతులు చూడాల్సి రావడం బాధాకరమని అభిప్రాయపడ్డారు.
అసలు ఈ నో-హ్యాండ్షేక్ విధానం ఎప్పుడు మొదలైందంటే.. గతేడాది దుబాయ్లో జరిగిన ఆసియా కప్ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. భారత్-పాక్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో, బీసీసీఐ నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాల ప్రకారం భారత ఆటగాళ్లు పాకిస్థానీలతో షేక్ హ్యాండ్ చేయడం ఆపేశారు. ఆసియా కప్ 2025లో మూడుసార్లు తలపడినా ఇదే పరిస్థితి కనిపించింది. మహిళల క్రికెట్, అండర్-19 జట్లు కూడా ఇదే పద్ధతిని అనుసరించాయి. ఇప్పుడు 2026 వరల్డ్ కప్లో కూడా అదే సీన్ రిపీట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.
నిజానికి గతంలో విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం లేదా రిజ్వాన్ వంటి ఆటగాళ్లు మైదానంలో ఎంతో స్నేహపూర్వకంగా పలకరించుకునే వారు. ఒకరి బ్యాట్ను మరొకరు పరిశీలించడం, జోకులు వేసుకోవడం చూశాం. కానీ ఈ ఏడాది అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో మాత్రం టీమ్ ఇండియా ఆటగాళ్లు పాక్ ప్లేయర్స్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మరి అలిస్టర్ కుక్ చెప్పినట్లు హోటల్ గదుల్లో లేదా రహస్యంగా వీరు కలుస్తున్నారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ సూపర్-8 లేదా ఫైనల్లో మళ్ళీ తలపడినా ఇదే మౌన యుద్ధం కొనసాగేలా కనిపిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
