Team India : జులై 1 నుంచి ఇంగ్లాండ్ టూర్.. రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు

Team India : ఆఫ్ఘనిస్తాన్‌పై సిరీస్ విజయం తర్వాత రోహిత్ శర్మ భవిష్యత్తు, జట్టు ఎంపికపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్ టూర్‌కు ముందు యువ ఆటగాళ్ల అవకాశాలు, యశస్వి జైస్వాల్ ప్రదర్శన, 2027 వరల్డ్‌కప్ ప్రణాళికలపై కీలక సంకేతాలు ఇచ్చాడు.

Team India : జులై 1 నుంచి ఇంగ్లాండ్ టూర్.. రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill

Updated on: Jun 21, 2026 | 8:02 AM

Team India : టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత క్రికెట్ జట్టు మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో భారత్ సొంతం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కెప్టెన్ గిల్.. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే జట్టు భవిష్యత్తుపై, రాబోయే సిరీస్‌ల సెలక్షన్ ప్రాసెస్ పై క్లారిటీ ఇచ్చాడు.

ఈ సిరీస్‌లోని మొదటి రెండు వన్డే మ్యాచ్‌లలో రోహిత్ శర్మ పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయినప్పటికీ.. మూడో వన్డేలో మాత్రం తన క్లాస్ చూపించాడు. కేవలం కొన్ని బంతుల్లోనే 79 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయానికి బలమైన పునాది వేశాడు. ఈ సిరీస్ మొత్తంలో రోహిత్ 143 రన్స్ చేశాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇంగ్లాండ్ టూర్‌ ఓపెనింగ్ కాంబినేషన్ గురించి అడగగా.. “జట్టులోని ఆటగాళ్లందరూ సూపర్ ఫామ్‌లో ఉండి అద్భుతంగా రాణిస్తున్నప్పుడు.. తుది జట్టును ఎంపిక చేయడం ఒక రకమైన మంచి తలనొప్పి లాంటిది” అని గిల్ నవ్వుతూ సమాధానమిచ్చాడు.

బీసీసీఐ, టీమిండియా మేనేజ్‌మెంట్ ఇప్పటి నుంచే 2027 వన్డే వరల్డ్ కప్ కోసం గట్టి ప్లాన్ సిద్ధం చేస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఈ వన్డే సిరీస్ ఆ ప్రిపరేషన్స్‌కు ఒక అద్భుతమైన ప్రారంభ రూపంగా నిలిచింది. జట్టులో సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లకు వరుసగా అవకాశాలు ఇస్తూ.. భవిష్యత్తు టోర్నీల కోసం ఒక పవర్‌ఫుల్ అండ్ బెస్ట్ కాంబినేషన్‌ను తయారు చేసే పనిలో కెప్టెన్ గిల్, కోచింగ్ స్టాఫ్ నిమగ్నమయ్యారు.

ఈ మ్యాచ్‌లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 110 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడమే కాకుండా.. తన వన్డే కెరీర్‌లో రెండో సెంచరీని నమోదు చేశాడు. జైస్వాల్ ఆటను మెచ్చుకుంటూనే అతడిని ఒక అన్‌లక్కీ ప్లేయర్ అని గిల్ సంబోధించాడు. “జట్టులో సీనియర్ ప్లేయర్స్ అందరూ అందుబాటులో ఉన్నప్పుడు.. దురదృష్టవశాత్తూ జైస్వాల్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తోంది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ భాయ్ ఆడకపోవడం వల్లే జైస్వాల్‌కు ఓపెనింగ్ చేసే అవకాశం వచ్చింది. దాన్ని తను వంద శాతం ఉపయోగించుకున్నాడు” అని గిల్ వివరించాడు.

ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ముగియడంతో భారత జట్టు తదుపరి ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధం కానుంది. ఈ మెగా టూర్ జులై 1 నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ పర్యటన కోసం అతి త్వరలోనే భారత వన్డే, టి20 జట్లను సెలక్టర్లు ప్రకటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం మొదట ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల భారీ టీ20 సిరీస్ జరగనుంది. ఆ తర్వాత జులై 14 నుంచి జులై 19 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతుంది. ఇంగ్లాండ్ పిచ్‌లపై కూడా ఇదే విధమైన ఆటతీరును కొనసాగిస్తామని కెప్టెన్ గిల్ ధీమా వ్యక్తం చేశాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us