టీ20 ప్రపంచకప్ తోపులు.. కట్‌చేస్తే.. వన్డే ప్రపంచకప్ నుంచి 8 మంది ఔట్.. ఇలా హ్యాండిచ్చారేంటి?

ODI World Cup 2027: టీ20 ప్రపంచకప్ 2026లో విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా, ఇప్పుడు తన తదుపరి లక్ష్యమైన 2027 వన్డే ప్రపంచకప్‌పై దృష్టి సారించింది. అయితే, పొట్టి ఫార్మాట్‌లో అదరగొట్టిన ఎనిమిది మంది కీలక ఆటగాళ్లకు వచ్చే వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది. యువ రక్తం, అనుభవం కలగలిసిన కొత్త జట్టుతో భారత్ బరిలోకి దిగనుంది.

టీ20 ప్రపంచకప్ తోపులు.. కట్‌చేస్తే.. వన్డే ప్రపంచకప్ నుంచి 8 మంది ఔట్.. ఇలా హ్యాండిచ్చారేంటి?
Team India

Updated on: Mar 25, 2026 | 10:05 AM

ODI World Cup 2027: దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్‌ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పుడే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2026 టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి కప్పు గెలిచిన జోరులో ఉన్న భారత్, వన్డే ఫార్మాట్‌లో మాత్రం సమూల మార్పులకు శ్రీకారం చుట్టనుంది. వన్డే క్రికెట్ అనేది సహనం, సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేవలం మెరుపు దాడి చేసే ఆటగాళ్లను కాకుండా, ఇన్నింగ్స్‌ను నిర్మించే వారిపై యాజమాన్యం మొగ్గు చూపుతోంది.

ఆ ఎనిమిది మందికి నిరాశేనా..?

టీ20 ప్రపంచకప్‌లో మెరిసిన సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లకు 2027 వన్డే జట్టులో చోటు దక్కకపోవచ్చు. వీరంతా ప్రధానంగా టీ20 స్పెషలిస్టులుగా ముద్రపడటం, వన్డే ఫార్మాట్‌కు అవసరమైన నిలకడ లేకపోవడం వీరి ఎంపికపై ప్రభావం చూపుతోంది. అయితే, రాబోయే దేశవాళీ, ద్వైపాక్షిక సిరీస్‌లలో వీరు అద్భుతంగా రాణిస్తే తప్ప పునరాగమనం కష్టమే.

కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్..?

భవిష్యత్తు సారథిగా శుభ్‌మన్ గిల్‌ను సిద్ధం చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు. గిల్ ఇప్పటికే తన బ్యాటింగ్, నాయకత్వ లక్షణాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లలో ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ, సుదీర్ఘ కాలం పాటు జట్టును నడిపించే సామర్థ్యం గిల్‌కు ఉందని యాజమాన్యం నమ్ముతోంది. ఓపెనర్‌గా గిల్ ఇచ్చే ఆరంభాలు జట్టుకు అత్యంత కీలకం కానున్నాయి.

రోహిత్, కోహ్లీల అనుభవమే శ్రీరామరక్ష..

వయసుపైబడుతున్నా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఫామ్ జట్టుకు కొండంత అండ. వన్డేల్లో కోహ్లీ స్థిరత్వం, రోహిత్ దూకుడు 2027లోనూ భారత్‌కు అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. వీరిద్దరూ ఫిట్‌నెస్‌ కాపాడుకుంటే జట్టులో ఉండటం ఖాయం. మరోవైపు కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా, జస్ప్రీత్ బుమ్రా ప్రధాన బౌలర్‌గా జట్టుకు వెన్నెముకలా నిలవనున్నారు.

ప్రపంచకప్ 2027 కోసం భారత సంభావ్య జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, యశస్వి జైస్వాల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us