IND vs ENG: టీమిండియా కెప్టెన్సీలో మరోమార్పు.. ఆ 2 టీ20లకు సారథిగా దినేష్ కార్తీక్.. ఎందుకంటే?

|

Jul 01, 2022 | 4:59 PM

భారత వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ మూడేళ్ల తర్వాత టీమిండియాకు తిరిగి వచ్చాడు. ప్రస్తుతం రెండు సిరీస్‌లు ఆడిన తర్వాత టీ20 జట్టుకు కెప్టెన్‌గా మారుతున్నాడు.

IND vs ENG: టీమిండియా కెప్టెన్సీలో మరోమార్పు.. ఆ 2 టీ20లకు సారథిగా దినేష్ కార్తీక్.. ఎందుకంటే?
Ind Vs Eng T20 Dinesh Karthik
Follow us on

వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ మూడేళ్ల తర్వాత టీమ్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. కార్తీక్ తిరిగి వచ్చిన తర్వాత కేవలం రెండు సిరీస్‌లు మాత్రమే ఆడాడు. కానీ, ప్రస్తుతం అతను టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా మారనున్నాడు. డెర్బీషైర్, నార్తాంప్టన్‌షైర్‌లతో జరిగే రెండు వార్మప్ మ్యాచ్‌లకు దినేష్ కార్తీక్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు డెర్బీషైర్‌తో భారత జట్టు మొదటి వార్మప్ మ్యాచ్ ఆడబోతోంది. ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో హార్దిక్ పాండ్యా టీమ్ ఇండియాకు సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. అక్కడ భారత్ 2-0తో గెలిచింది. ఇప్పుడు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు, టీమ్ ఇండియా 2 వార్మప్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. దినేష్ కార్తీక్ జట్టు కమాండ్‌ని చేపట్టబోతున్నాడు. మీడియా కథనాల ప్రకారం హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

2022లో కెప్టెన్ల మార్పులు..

2022లో టీమ్ ఇండియాకు నిరంతరం కొత్త కెప్టెన్లు లభిస్తున్నారు. విరాట్ కోహ్లి తర్వాత రోహిత్ శర్మ టీమ్ ఇండియాకు కెప్టెన్ అయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహించాడు. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో హార్దిక్, దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో రిషబ్ పంత్ కెప్టెన్లుగా బాధ్యతలు స్వీకరించారు. ఇక నేటి నుంచి ఇంగ్లండ్‌లో జరుగుతోన్న ఏకైక టెస్ట్‌కు బుమ్రా టీమిండియాకు కెప్టెన్‌గా మారాడు. తాజాగా దినేష్ కార్తీక్ 2 వార్మప్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

ఇవి కూడా చదవండి

మూడేళ్ల తర్వాత దినేష్ కార్తీక్ ఎంట్రీ..

దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దినేష్ కార్తీక్ టీమ్ ఇండియాలోకి పునరాగమనం చేశాడు. ఈ అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్ 2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో చివరిసారి ఆడాడు. ఆ తర్వాత కార్తీక్ మూడు సంవత్సరాల పాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2022లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత కార్తీక్ మరోసారి జట్టులో చోటు దక్కించుకున్నాడు. కార్తీక్ ఫినిషర్‌గా అద్భుతంగా ఆడాడు. ప్రస్తుతం అతను ఆస్ట్రేలియాలో జరగనున్న T20 ప్రపంచ కప్‌కు కీలకమైన ఫినిషర్‌గా కనిపించేందుకు సిద్ధమయ్యాడు.

భారత్‌-ఇంగ్లండ్‌ల మధ్య టీ20 సిరీస్‌ షెడ్యూల్‌..

ఎడ్జ్‌బాస్టన్ టెస్టు తర్వాత ఇంగ్లండ్‌తో టీమిండియా 3 టీ20లు, 3 వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. తొలి టీ20 జులై 7న సౌతాంప్టన్‌లో జరగనుంది. జులై 9న బర్మింగ్‌హామ్‌లో రెండో టీ20, జులై 10న నాటింగ్‌హామ్‌లో మూడో టీ20 జరగనుంది. ఆ తర్వాత తొలి వన్డే జులై 12న జరగనుంది. రెండో వన్డే 14న, మూడో వన్డే జులై 17న జరగనున్నాయి. దీంతో టీమిండియా ఇంగ్లండ్ పర్యటన ముగుస్తుంది.