T20 World Cup Final : ధోనీ, రోహిత్ శర్మల వల్ల కాలేదు.. సూర్యకుమార్ యాదవ్ సింగిల్ డిజిట్ శాపాన్ని వదిలిస్తాడా ?

T20 World Cup Final : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు జరగనున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత కెప్టెన్లు ఇప్పటివరకు రెండంకెల స్కోరు సాధించలేదు. నేడు న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ ఆ బ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తాడా అనేది ఆసక్తికరం.

T20 World Cup Final  : ధోనీ, రోహిత్ శర్మల వల్ల కాలేదు.. సూర్యకుమార్ యాదవ్ సింగిల్ డిజిట్ శాపాన్ని వదిలిస్తాడా ?
Suryakumar Yadav

Updated on: Mar 08, 2026 | 1:09 PM

T20 World Cup Final : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ ముందు ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే మూడు టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తుంది. అంతేకాకుండా వరుసగా రెండుసార్లు టైటిల్‌ను కాపాడుకున్న మొదటి జట్టుగా కూడా భారత్ నిలుస్తుంది. అయితే, కప్పు గెలవడంతో పాటు సూర్య ముందు ఒక వింతైన కెప్టెన్ల బ్యాడ్ సెంటిమెంట్‎ను బద్దలు కొట్టాల్సిన బాధ్యత కూడా ఉంది.

టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ ఇప్పటివరకు మూడుసార్లు ఫైనల్ ఆడింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ మూడు ఫైనల్స్‌లోనూ భారత కెప్టెన్లు కనీసం పది పరుగులు కూడా దాటలేకపోయారు. 2007 ఫైనల్లో పాకిస్థాన్‌పై ధోనీ కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. 2014 ఫైనల్లో శ్రీలంకపై ధోనీ 7 బంతుల్లో 4 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక 2024 ఫైనల్లో రోహిత్ శర్మ 5 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. మొత్తంగా గత మూడు ఫైనల్స్‌లో భారత కెప్టెన్లు కలిసి చేసిన పరుగులు కేవలం 19 మాత్రమే. ఈ సింగిల్ డిజిట్ ట్రెండ్‌ను సూర్య ఈరోజు అహ్మదాబాద్‌లో తుడిచిపెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఈ టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచుల్లో 34.57 సగటుతో 242 పరుగులు చేశాడు. టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా ఉన్నాడు. ఒక హాఫ్ సెంచరీతో పాటు కీలక సమయాల్లో వేగంగా పరుగులు రాబడుతున్నాడు. మైదానం నలుమూలలా షాట్లు కొట్టే సూర్యకు అహ్మదాబాద్ పిచ్ బాగా కలిసివచ్చే అవకాశం ఉంది. కెప్టెన్ హోదాలో తానూ రాణించి, పెద్ద స్కోరు సాధిస్తే ఈ పాత రికార్డు మరుగున పడిపోవడం ఖాయం.

సూర్య కేవలం బ్యాటర్‌గా మాత్రమే కాకుండా, కెప్టెన్‌గా కూడా తన మార్కు చూపిస్తున్నాడు. సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌పై బౌలింగ్ మార్పులు చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈరోజు కివీస్‌ను చిత్తు చేస్తే, టీ20 ఫార్మాట్‌లో భారత్ తిరుగులేని శక్తిగా అవతరిస్తుంది. అహ్మదాబాద్ మైదానంలో లక్షకు పైగా ప్రేక్షకుల మధ్య సూర్య తన బ్యాట్‌తో మ్యాజిక్ చేసి, ఈ వింతైన ట్రెండ్‌కు ఫుల్‌స్టాప్ పెడతాడని దేశమంతా ఆశిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us