MS Dhoni IPL Retirement : వచ్చే ఏడాది ఆడతాడా లేదా? ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై సురేష్ రైనా బిగ్ లీక్

MS Dhoni IPL Retirement : ఐపీఎల్లో చెన్నె సూపర్ కింగ్స్ (CSK) ఫ్యాన్స్‌కు ఇదొక ఊహించని సీజన్ అనే చెప్పాలి. ఐపీఎల్ 2026 ప్రారంభమై ఇన్ని రోజులవుతున్నా ఇప్పటివరకు మాజీ కెప్టెన్, లెజెండ్ ఎంఎస్ ధోనీ మైదానంలోకి బ్యాట్ పట్టుకుని దిగలేదు.

MS Dhoni IPL Retirement : వచ్చే ఏడాది ఆడతాడా లేదా? ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై సురేష్ రైనా బిగ్ లీక్
Ms Dhoni

Updated on: May 19, 2026 | 12:37 PM

MS Dhoni IPL Retirement : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్యాన్స్‌కు ఇదొక ఊహించని సీజన్ అనే చెప్పాలి. ఐపీఎల్ 2026 ప్రారంభమై ఇన్ని రోజులవుతున్నా ఇప్పటివరకు మాజీ కెప్టెన్, లెజెండ్ ఎంఎస్ ధోనీ మైదానంలోకి బ్యాట్ పట్టుకుని దిగలేదు. ఈ నేపథ్యంలో ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ గురించిన చర్చలు దేశవ్యాప్తంగా జోరందుకున్నాయి. చెన్నైలోని హోమ్ గ్రౌండ్ చెపాక్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌లో కూడా ధోనీ ఆడకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ధోనీ వచ్చే ఏడాది ఐపీఎల్ 2027లో ఆడతాడా లేదా అనే విషయంపై అతని అత్యంత ఆప్తమిత్రుడు సురేష్ రైనా ఒక ఆసక్తికరమైన విషయాన్ని లీక్ చేశాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ ముగిసిన అనంతరం స్టార్ స్పోర్ట్స్ పోస్ట్ మ్యాచ్ షోలో సురేష్ రైనా మాట్లాడాడు. ధోనీ రిటైర్మెంట్ గురించి తాను స్వయంగా అడిగినట్లు రైనా వెల్లడించాడు. “నేను ధోనీతో అన్నాను.. ‘మహీ భాయ్, నువ్వు ఐపీఎల్ 2026 సీజన్‌కు కేవలం ఒక మిస్డ్‌కాల్ ఇచ్చావ్. ఇది అసలు లెక్కల్లోకే రాదు. వచ్చే ఏడాది నువ్వు ఖచ్చితంగా మళ్లీ మైదానంలోకి రావాల్సిందే’ అని చెప్పాను. దానికి ధోనీ నవ్వుతూ.. లేదు బ్రదర్, శరీరం ఇప్పుడు అంతగా సహకరించడం లేదు అని సమాధానం ఇచ్చాడు. కానీ నేను మాత్రం మేము ఏమీ నమ్మం.. నువ్వు వచ్చే ఏడాది ఆడాల్సిందే అని గట్టిగా అడిగాను” అంటూ రైనా చెప్పుకొచ్చాడు.

44 ఏళ్ల వయసులోనూ ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే ఈ సీజన్ ప్రారంభంలోనే పిక్క కండరాల గాయం కారణంగా అతను మొదటి రెండు వారాలు ఆటకు దూరమయ్యాడు. ఆ గాయం నుంచి కోలుకునే లోపే తాజాగా బొటనవేలి గాయం కావడంతో ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని ప్రచారం జరగడంతో, చెపాక్ స్టేడియానికి ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. మ్యాచ్ ఆడకపోయినా ధోనీ కేవలం మైదానంలో కనిపించడంతోనే అభిమానులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ధోనీ తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు రాంచీలో ముగింపు పలికినట్లు, ఐపీఎల్‌కు చెన్నైలోనే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ ఆరంభంలో తీవ్రంగా తడబడింది. ధోనీ లాంటి సీనియర్ మైదానంలో లేకపోవడం, ఆటగాళ్ల గాయాలు జట్టును దెబ్బతీశాయి. అయినప్పటికీ, చెన్నై ఈ సీజన్‌లో నెమ్మదిగా పుంజుకుంది. ముఖ్యంగా ఈ ఏడాది సీఎస్‌కే తరపున ఆడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుతమైన బ్యాటింగ్ ఫామ్‌తో జట్టుకు కొండంత అండగా నిలిచాడు. బౌలింగ్ విభాగంలో అన్షుల్ కాంబోజ్, అఖీల్ హొస్సేన్ తమ అద్భుత ప్రదర్శనలతో కొన్ని మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించారు.

ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ 13 మ్యాచ్‌లు ఆడి కేవలం ఆరింట్లో విజయం సాధించి, ఏడింటిలో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం సిక్స్త్ ప్లేస్ (6వ స్థానం) లో కొనసాగుతోంది. అయినప్పటికీ, సీఎస్‌కే ప్లేఆఫ్స్ రేసులో ఇంకా సజీవంగానే ఉంది. మే 21న గుజరాత్ టైటాన్స్ (GT) తో జరగబోయే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై ఖచ్చితంగా భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. దాంతో పాటు పాయింట్ల పట్టికలో తమ కంటే పైన ఉన్న రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్ జట్లు తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడిపోవాలని ప్రార్థించాలి. అప్పుడే లక్ కలిసివచ్చి రన్ రేట్ ఆధారంగా చెన్నై టాప్-4 లోకి దూసుకెళ్తుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us