AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya : రోహిత్ తర్వాత ధోని లాంటి క్వాలిటీ ఉన్న అతనే కెప్టెన్..రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా, భవిష్యత్తులో భారత వన్డే జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ కాకుండా హార్దిక్ పాండ్యా అయితేనే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. చాలా మంది మాజీ ఆటగాళ్లు, నిపుణులు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ తర్వాత శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా ఎంచుకోగా, రైనా మాత్రం హార్దిక్ పాండ్యాకు సపోర్టుగా నిలిచాడు.

Hardik Pandya : రోహిత్ తర్వాత ధోని లాంటి క్వాలిటీ ఉన్న అతనే కెప్టెన్..రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వైట్-బాల్ సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన అక్టోబర్ 19న ప్రారంభమై నవంబర్ 8న ముగుస్తుంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం, పాండ్యా ప్రస్తుత గాయం కోలుకోవడానికి నాలుగు వారాల సమయం పట్టవచ్చు.
Rakesh
|

Updated on: Aug 31, 2025 | 12:38 PM

Share

Hardik Pandya : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తర్వాత భారత వన్డే జట్టుకు కెప్టెన్‌గా శుభమన్ గిల్ అయితే బాగుంటుందని చాలా మంది మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ, భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా మాత్రం గిల్​ను కాదని, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. బరోడా ఆల్‌రౌండర్ హార్దిక్, గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ గెలిపించాడు. గతేడాది రోహిత్, కోహ్లీ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకున్నప్పుడు హార్దిక్ టీ20 కెప్టెన్సీని కూడా ఆశించాడు. అయితే, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా సెలెక్టర్లు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా సెలక్ట్ చేశారు. అయితే, రైనా మాత్రం హార్దిక్‌లో మహేంద్ర సింగ్ ధోని లాంటి లక్షణాలు ఉన్నాయని, 1983లో మొదటి వరల్డ్ కప్ గెలిపించిన కపిల్ దేవ్‌తో అతన్ని పోల్చాడు.

శుభంకర్ మిశ్రా యూట్యూబ్ ఛానల్‌లో సురేష్ రైనా మాట్లాడుతూ.. “శుభమన్ గిల్ కెప్టెన్‌గా ఎప్పుడు ఉంటాడనేది జట్టు యాజమాన్యం నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ నేను మాత్రం హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వైట్-బాల్ క్రికెట్‌లో అద్భుతాలు సృష్టిస్తాడని అనుకుంటున్నాను. శుభమన్ గిల్ కూడా కెప్టెన్సీకి మంచి ఆటగాడే. కానీ హార్దిక్‌కు మళ్లీ కెప్టెన్సీ రావాలని నేను కోరుకుంటున్నాను. కపిల్ దేవ్‌కు ఉన్నట్లుగానే బ్యాటింగ్‌, బౌలింగ్, ఫీల్డింగ్‌లో హార్దిక్‌కు చాలా అనుభవం ఉంది. అతను చాలా సానుకూల దృక్పథం గల ఆటగాడు. అతని ప్రదర్శన కూడా అలాగే ఉంది. అతను ఆటగాళ్ల కోసం ఆడే కెప్టెన్. అతనిలో నాకు ఎంఎస్ ధోని ఛాయలు కనిపిస్తున్నాయి. మైదానంలో అతను ఇంటరాక్ట్ అయ్యే విధానం, అతని శక్తి నాకు చాలా నచ్చింది” అని చెప్పాడు.

హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు 94 వన్డేలలో 32.82 సగటుతో, 110.89 స్ట్రైక్ రేట్‌తో 1904 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 5.60 ఎకానమీ రేట్‌తో 91 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్‌ను కెప్టెన్‌గా సెలక్ట్ చేసుకున్నప్పటికీ, రోహిత్, కోహ్లీలు 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడాలని రైనా అభిప్రాయపడ్డాడు. “రో-కో 50 ఓవర్ల వరల్డ్ కప్ ఆడాలి. ఎందుకంటే వారు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నారు. వారికి చాలా అనుభవం ఉంది. రోహిత్ దేశవాళీ క్రికెట్ కూడా ఆడుతాడు, ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. ఇది పూర్తిగా సెలెక్టర్లు ఏ జట్టును ఎంపిక చేస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది” అని రైనా అన్నాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి