
Sri Lanka New Captain : వెస్టిండీస్ పర్యటనకు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్ కు కొత్త సారథిగా కుసాల్ మెండిస్ను నియమించింది. ఐపీఎల్ టోర్నీలో ఆడుతున్న దాసున్ శనక, చరిత్ అసలంకలను పక్కనపెట్టి ఈ వికెట్ కీపర్ బ్యాటర్కు వన్డే, టీ20 జట్ల కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడం గమనార్హం. వెస్టిండీస్ పర్యటన కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు తమ మూడు ఫార్మాట్ల బలమైన జట్లను అధికారికంగా ప్రకటించింది. ఈ టూర్ లో భాగంగా జూన్ 3 నుంచి వెస్టిండీస్ జట్టుతో శ్రీలంక సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనకు కుసాల్ మెండిస్ను వన్డే, టీ20 జట్లకు కొత్త కెప్టెన్గా ఎంపిక చేశారు. గతంలో 17 వన్డే మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించిన అనుభవం మెండిస్కు ఉంది. అయితే ఇప్పుడు అతనికి టీ20 బాధ్యతలు కూడా అప్పగించడంతో దాసున్ శనక, చరిత్ అసలంకల కెప్టెన్సీ యుగానికి తెరపడింది. ప్రస్తుతం దాసున్ శనక ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
ఈ పర్యటన కోసం ప్రకటించిన జట్టులో ఐపీఎల్ లో రాణిస్తున్న ఆటగాళ్లకు చోటు లభించింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసి అదరగొడుతున్న ఈషాన్ మలింగకు వన్డే, టీ20 జట్టులో స్థానం దక్కింది. అలాగే లెగ్ స్పిన్నర్ వానిందు హసరంగ రెండు జట్లలోకి తిరిగి ప్రవేశించాడు. ఐపీఎల్ ఆడటానికి అనుమతి లభించని నువాన్ తుషారను కూడా ఇప్పుడు టీ20 జట్టులోకి తీసుకున్నారు. ఓపెనర్ లసిత్ క్రుస్పుల్లేకు 3 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టీ20 జట్టులో చోటు దక్కింది.
టెస్ట్ జట్టులో కూడా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. నిషాన్ మధుశంక, రమేష్ మెండిస్, లాహిరు కుమారలు టెస్ట్ జట్టులోకి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ పర్యటనలో భాగంగా జూన్ 3 నుంచి జూన్ 8 వరకు మూడు వన్డే మ్యాచ్లు జరుగుతాయి. ఆ తర్వాత జూన్ 12, 14, 15 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్లు నిర్వహిస్తారు. చివరగా జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్తో ఈ పర్యటన ముగుస్తుంది. ఇందుకోసం శ్రీలంక జట్టు మే 26 న వెస్టిండీస్ బయలుదేరి వెళ్లనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..