SRH Spinner : ఐపీఎల్‌లో మొహం చాటేసినా.. టీమిండియా పిలుపు అందుకున్న ఎస్‌ఆర్‌హెచ్ స్టార్

SRH Spinner : ఐపీఎల్ 2026 లో ఒక్క మ్యాచ్ ఆడని ఎస్‌ఆర్‌హెచ్ స్పిన్నర్ జీషన్ అన్సారీకి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. అఫ్గానిస్తాన్‌తో జరిగే టెస్ట్ మ్యాచ్‌కు ఆయన నెట్ బౌలర్‌గా ఎంపికయ్యారు. ఐపీఎల్‌లో నిరాశ ఎదురైనా.. జాతీయ జట్టు ఆటగాళ్లకు బౌలింగ్ చేసే ఇంత పెద్ద అవకాశం రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

SRH Spinner : ఐపీఎల్‌లో మొహం చాటేసినా.. టీమిండియా పిలుపు అందుకున్న ఎస్‌ఆర్‌హెచ్ స్టార్
Srh

Updated on: Jun 02, 2026 | 3:13 PM

SRH Spinner : సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు, క్రికెట్ ప్రేమికులకు ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం దక్కించుకోలేకపోయిన ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ స్పిన్నర్ జీషన్ అన్సారీకి అదృష్టం వరించింది. భారత్, అఫ్గానిస్తాన్ మధ్య జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం ఆయనకు టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. చండీగఢ్‌లో జరుగుతున్న భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్‌లో ఆయన నెట్ బౌలర్‎గా చేరబోతున్నట్లు జీషన్ అన్సారీ కోచ్ గోపాల్ సింగ్ అధికారికంగా ధృవీకరించారు. ఐపీఎల్‌లో నిరాశ ఎదురైనా.. జాతీయ జట్టు ఆటగాళ్లకు బౌలింగ్ చేసే ఇంత పెద్ద అవకాశం రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు జీషన్ అన్సారీని బెంచ్‌కే పరిమితం చేసినప్పటికీ.. ఆయన ప్రతిభను సెలెక్టర్లు గుర్తించారు. ఇప్పుడు చండీగఢ్‌ వేదికగా టీమిండియా నెట్ సెషన్స్‌లో పాల్గొనేందుకు జీషన్ బయల్దేరి వెళ్లారు. నెట్స్‌లో భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‎తో పాటు ఇతర స్టార్ బ్యాటర్లకు బౌలింగ్ చేసి ఇంప్రెస్ చేయడానికి ఇది ఆయనకు ఒక అద్భుతమైన వేదికగా మారనుంది. ఒక ఆటగాడి విలువ కేవలం మ్యాచ్ రోజు మాత్రమే కాకుండా.. ఇలా కూడా ఎంతో ఉంటుందని ఈ నిర్ణయం నిరూపించింది.

భారత జట్టు అఫ్గానిస్తాన్‌తో తలపడబోయే ఈ రెడ్-బాల్ మ్యాచ్ కోసం పక్కా ప్లాన్‌తో సిద్ధమవుతోంది. అఫ్గానిస్తాన్ జట్టులో నలుగురు పవర్‌ఫుల్ స్పిన్నర్లు ఉన్నారు. వారు చండీగఢ్ లోని నెమ్మదైన పిచ్‌లపై భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందుకే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ వైవిధ్యమైన బౌలింగ్ శైలి.. భారత బ్యాటర్లకు అఫ్గాన్ స్పిన్ అటాక్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని కోచ్ గోపాల్ సింగ్ తెలిపారు.

డిసెంబర్ 1999లో జన్మించిన 26 ఏళ్ల జీషన్ అన్సారీ.. అద్భుతమైన వైవిధ్యాలు ఉన్న ఉత్తరప్రదేశ్ లెగ్ స్పిన్నర్. ఆయన 2016 లో అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత ఐపీఎల్ 2025 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తరఫున అరంగేట్రం చేసి 10 మ్యాచుల్లో 6 వికెట్లు పడగొట్టారు. కానీ ఐపీఎల్ 2026లో శివాంగ్ కుమార్, హర్ష్ దూబే వంటి అన్‌క్యాప్డ్ స్పిన్నర్లకే ఎస్‌ఆర్‌హెచ్ ప్రాధాన్యత ఇవ్వడంతో జీషన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు.

ఐపీఎల్‌లో అవకాశం రాకపోయినప్పటికీ.. దేశవ్యాప్తంగా జరిగిన వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో జీషన్ అన్సారీ అరాచకమైన ప్రదర్శన చేశారు. ఉత్తరప్రదేశ్ జట్టు తరఫున కేవలం 8 ఇన్నింగ్స్‌ల్లోనే ఏకంగా 21 వికెట్లు పడగొట్టి.. ఆ టోర్నమెంట్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు సృష్టించారు. ఈ అద్భుతమైన ఫామ్, పవర్‌ఫుల్ రికార్డే ఇప్పుడు ఆయనను టీమిండియా క్యాంప్ వైపు నడిపించింది. టీమిండియా దాదాపు ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టెస్ట్ క్రికెట్ ఆడబోతోంది. జూన్ 6 నుంచి జూన్ 10 వరకు న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ మధ్య ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టెస్ట్ సీజన్‌ను ఘనంగా ప్రారంభించాలని భారత జట్టు పట్టుదలగా ఉంది.

 

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us