
ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్కు చేరుకుంటున్న వేళ సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అందుబాటుపై స్పష్టత వచ్చింది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన గత మ్యాచ్లో నితీష్ ఆడకపోవడంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే, పంజాబ్ కింగ్స్తో మే 6న జరగనున్న మ్యాచ్కు నితీష్ పూర్తిగా కోలుకున్నాడని హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి ధృవీకరించారు.
“నేను ఈ ఉదయం నితీష్తో మాట్లాడాను, అతను ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నాడు. ఈరోజు హైదరాబాద్లో జరిగే ప్రాక్టీస్ సెషన్లో అతను పాల్గొంటాడు. రేపటి మ్యాచ్లో అతను ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అతను జట్టులో లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది” అని వెట్టోరి మీడియా సమావేశంలో వెల్లడించాడు.
మే 3, ఆదివారం నాడు కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో నితీష్ రెడ్డి ప్లేయింగ్ XIలో లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. టాస్ సమయంలో కెప్టెన్ పాట్ కమిన్స్ దీనిపై వివరణ ఇస్తూ.. నితీష్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడని, అందుకే అతని స్థానంలో రవిచంద్రన్ స్మరణ్ను తీసుకున్నామని తెలిపాడు. ఈ సీజన్ మొదటి తొమ్మిది మ్యాచ్ల్లో నితీష్ అద్భుత ప్రదర్శన చేశాడు. 8 ఇన్నింగ్స్ల్లో 160.83 స్ట్రైక్ రేట్తో 193 పరుగులు చేయడమే కాకుండా, ఎల్ఎస్జీపై కేవలం 33 బంతుల్లోనే 56 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ సీజన్ ప్రారంభంలో ఇషాన్ కిషన్ తాత్కాలిక సారధ్యంలో ఆడిన ఎస్ఆర్హెచ్ తొలి నాలుగు మ్యాచ్ల్లో మూడింటిని కోల్పోయింది. అయితే, రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ రాకతో జట్టు స్వరూపమే మారిపోయింది. వరుసగా ఐదు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో దూసుకెళ్లింది. కేకేఆర్తో జరిగిన గత మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైనప్పటికీ, ఎస్ఆర్హెచ్ ప్రస్తుతం 10 మ్యాచ్ల్లో ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.
మే 6న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జరగనున్న మ్యాచ్ హైదరాబాద్కు అత్యంత కీలకం. ఈ మ్యాచ్లో గెలిస్తే ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్ కూడా ప్రస్తుతం ఫామ్లో ఉండటంతో, ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. ముఖ్యంగా నితీష్ రెడ్డి వంటి ఆల్రౌండర్ తిరిగి రావడం కమిన్స్ సేనకు అదనపు బలం కానుంది. మిడిల్ ఆర్డర్లో వేగంగా పరుగులు చేయడంతో పాటు అవసరమైనప్పుడు వికెట్లు తీయగల సామర్థ్యం నితీష్ సొంతం.
తెలుగు క్రికెటర్ నితీష్ రెడ్డి ఈ సీజన్లో తన సత్తా చాటుతూ జాతీయ జట్టు దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో అతను మెరిస్తే, ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ ఆశలు మరింత సజీవమవుతాయి. ఉప్పల్ స్టేడియంలో మళ్లీ ఆరెంజ్ ఆర్మీ జెండా రెపరెపలాడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..