
Smriti Mandhana: భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం అయింది. ఆసియా కప్ 2026 పోటీల్లో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన హాంకాంగ్పై విధ్వంసకర సెంచరీతో చెలరేగి ప్రపంచ రికార్డు నమోదు చేసింది. మిథాలీ రాజ్ పేరిట ఉన్న అత్యధిక అంతర్జాతీయ పరుగుల ఆల్టైమ్ రికార్డును అధిగమించి, మహిళల క్రికెట్లో అగ్రపీఠాన్ని కైవసంచేసుకుని భారతదేశ కీర్తిపతాకాన్ని ఎగరేసింది.
దుబాయ్ వేదికగా హాంకాంగ్తో జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్లో స్మృతి మంధాన బౌండరీల సునామీ సృష్టించింది. ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా దాడి చేసిన మంధాన, కేవలం 57 బంతుల్లోనే తన సెంచరీ మార్కును అందుకుంది. ఈ క్రమంలో 14 ఫోర్లు, 7 మైండ్ బ్లోయింగ్ సిక్సర్లతో విరుచుకుపడి 124 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడింది. ఆమె విధ్వంసకర బ్యాటింగ్ దెబ్బకు భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరును సాధించింది.
ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ద్వారా మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా స్మృతి మంధాన సరికొత్త ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఇప్పటివరకు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ 333 మ్యాచ్ల్లో చేసిన 10,868 పరుగుల రికార్డే అగ్రస్థానంలో ఉండేది. మంధాన కేవలం 302 మ్యాచ్ల్లోనే 10,880 పరుగులు సాధించి మిథాలీని అధిగమించింది. న్యూజిలాండ్ ఆల్రౌండర్ సుజీ బేట్స్ (10,740), ఇంగ్లండ్ దిగ్గజం షార్లెట్ ఎడ్వర్డ్స్ (10,273) వరుసగా తదుపరి స్థానాల్లో ఉన్నారు.
ఈ అద్భుత సెంచరీతో టీ20 అంతర్జాతీయ క్రికెట్లో రెండు సెంచరీలు సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్గా మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో 2025లో ఇంగ్లండ్పై ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో ఆమె తన తొలి టి20 సెంచరీ (112) సాధించింది. భారత కెప్టెన్ హర్మాన్ప్రీత్ కౌర్ 2018లో సాధించిన ఒకే ఒక్క సెంచరీ రికార్డును మంధాన ఇప్పటికే అధిగమించగా, ఇప్పుడు రెండు సెంచరీలతో సరికొత్త మైలురాయిని చేరుకుంది.
స్మృతి మంధాన విధ్వంసానికి తోడు భారత బ్యాటర్లు రన్ రేట్ పెంచడంతో హాంకాంగ్ బౌలర్లు తీవ్ర ఒత్తిడిలో పడిపోయారు. హాంకాంగ్ బౌలర్లలో మెరీనా లాంప్లో రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోలేకపోయారు. ఆసియా కప్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్, తదుపరి మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడేందుకు పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..