
Asian Games 2026: భారత టీ20 ప్రపంచకప్ హీరో, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అభిమానులకు బీసీసీఐ ఒకేసారి షాక్ ఇస్తూనే మరోపక్క తీపి కబురు అందించింది. జింబాబ్వే పర్యటనకు ప్రకటించిన టీ20 జట్టులో సంజూకు చోటు దక్కకపోవడం గమనార్హం. అయితే ఇది ఉద్వాసన కాదని, ఆసియా క్రీడల దృష్ట్యా అతనికి విశ్రాంతి మాత్రమేనని సమాచారం.
ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026లో అద్భుత ప్రదర్శనతో భారత్కు చారిత్రాత్మక విజయాన్ని అందించిన సంజూ శాంసన్, ఆ తర్వాత ఐపీఎల్ 2026లోనూ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున పరుగుల వరద పారించాడు. అయితే, ఆ వెంటనే జరిగిన ఐరోపా పర్యటనలో (ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్లు) కేవలం మూడు ఇన్నింగ్స్ల్లో 6 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ పేలవ ఫామ్ నేపథ్యంలోనే జులై 6న ప్రకటించిన జింబాబ్వే పర్యటనకు సంజూను పక్కన పెట్టడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే సెలెక్టర్లు అతడిని జట్టు నుంచి తొలగించలేదని, సీనియర్ పేసర్ అర్ష్దీప్ సింగ్తో పాటు సంజూకు కూడా ఈ సిరీస్ నుంచి కేవలం విశ్రాంతి మాత్రమే ఇచ్చారని బోర్డు వర్గాల సమాచారం.
జింబాబ్వే పర్యటనకు ఎంపిక కానంత మాత్రాన సంజూ శాంసన్ అంతర్జాతీయ కెరీర్కు వచ్చిన ముప్పేమీ లేదు. ఎందుకంటే, జింబాబ్వే సిరీస్ ముగిసిన నెలన్నర రోజులకే జపాన్లో జరగబోయే 2026 ఆసియా క్రీడల (Asian Games) కోసం బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో సంజూకు చోటు దక్కింది. ఈ ప్రతిష్టాత్మక మెగా టోర్నీలో ఇషాన్ కిషన్తో పాటు సంజూ శాంసన్ ప్రధాన వికెట్ కీపర్ బ్యాటర్గా బరిలోకి దిగనున్నాడు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు జపాన్లోని నిస్సిన్ నగరంలో జరిగే ఈ టీ20 ఈవెంట్లో సంజూ మరోసారి టీమిండియా తరపున మెరవడానికి సిద్ధమవుతున్నాడు.
Here’s a look at #TeamIndia‘s squad for the Asian Games 2026 in Japan this September 👏#AsianGames pic.twitter.com/euMfmhWEcN
— BCCI (@BCCI) June 6, 2026
జింబాబ్వేతో జరగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో యువకులతో కూడిన బలమైన జట్టును బీసీసీఐ రంగంలోకి దించుతోంది. రింకూ సింగ్ తిరిగి జట్టులోకి రాగా, యష్ ఠాకూర్, అశోక్ శర్మ తొలిసారి అంతర్జాతీయ పిలుపు అందుకున్నారు. ఆల్రౌండర్ హర్ష్ దూబే కూడా అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
జింబాబ్వే సిరీస్ భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్).
గతంలో చైనాలోని హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన టీమిండియా.. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్గా నేరుగా క్వార్టర్ ఫైనల్స్ బరిలోకి దిగుతుంది. జపాన్లోని కోరోగి స్పోర్ట్స్ పార్క్లో సెప్టెంబర్ 28న భారత్ తన తొలి మ్యాచ్ (క్వార్టర్ ఫైనల్) ఆడనుంది. ఇందులో గెలిస్తే నేరుగా సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తుంది.
ఆసియా క్రీడల భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివం దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, జస్ప్రీత్ బుమ్రా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..