
ODI World Cup 2027: టీ20 సిరీస్ ఘోర పరాజయం తర్వాత టీమిండియా ఇప్పుడు ఇంగ్లాండ్తో వన్డే పోరుకు సిద్ధమైంది. అయితే ఈ సిరీస్ కంటే ముందే కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం భారత క్రికెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ల భవితవ్యంపై ఇప్పుడు పెను సవాల్ పొంచి ఉంది.
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్ నేటి నుంచే ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా వంటి దిగ్గజాలు జట్టులోకి తిరిగొచ్చారు. తొలి మ్యాచ్కు ముందు కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ.. రోహిత్, విరాట్ అనుభవం జట్టుకు ఎంతో బలమని, 2027 ప్రపంచకప్కు వీరిద్దరి ఆటా, అనుభవమే టీమిండియాకు కొండంత అండ అని కొనియాడాడు. దాదాపు 600 వన్డేల అనుభవం ఉన్న ఈ ఇద్దరు దిగ్గజాలు జట్టులో ఉండటం దేశానికే గర్వకారణమని గిల్ పేర్కొన్నాడు. కానీ, తెరవెనుక జరుగుతున్న పరిణామాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్మెంట్ భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడటం లేదు. రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే యువ ఆటగాళ్లను సిద్ధం చేయాలని మేనేజ్మెంట్ గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్లను ఈ సిరీస్లో కలిపి ఆడించే అవకాశాలు కనిపించడం లేదు. వీరి ముగ్గురిపై ‘రొటేషన్ పాలసీ’ (మార్పిడి విధానం) ప్రయోగించాలని గంభీర్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వచ్చే ఏడాది జరగబోయే ప్రతిష్టాత్మక ఐసీసీ టోర్నీల కంటే ముందే యువ రక్తాన్ని పరీక్షించాలని సెలక్టర్లు, మేనేజ్మెంట్ భావిస్తోంది.
ఈ రొటేషన్ విధానంపై సీనియర్ ఆటగాళ్లను ఒప్పించేందుకు మేనేజ్మెంట్ గత కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. అయితే దీనికి సీనియర్ల నుంచి ఆశించిన మద్దతు లభించడం లేదని తెలుస్తోంది. గతంలో చెన్నైలో అఫ్గానిస్థాన్తో జరిగిన మూడో వన్డేలో యశస్వి జైస్వాల్కు అవకాశం ఇవ్వడం కోసం రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ భావించింది. కానీ రోహిత్ అందుకు నిరాకరించినట్లు సమాచారం. దాంతో కెప్టెన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్కు రాగా, రోహిత్-జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి వచ్చింది. ఇలాంటి పరిణామాలు మేనేజ్మెంట్కు నచ్చడం లేదని, అందుకే ఇప్పుడు మరింత కఠినంగా వ్యవహరించాలని గంభీర్ భావిస్తున్నట్లు టాక్.
ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్లో జైస్వాల్ జట్టులో లేకపోవడంతో రోహిత్ శర్మపై భారీ ఒత్తిడి ఉండనుంది. సిరీస్ ఆఖరి మ్యాచ్ల్లో కాకుండా, మొదటి నుంచే పరుగుల వరద పారించాలని మేనేజ్మెంట్ రోహిత్కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ శర్మ గనుక ఆశించిన స్థాయిలో రాణించకపోతే, అతని స్థానానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కేవలం రోహిత్ మాత్రమే కాదు, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ భవితవ్యం కూడా ఇప్పుడు సందిగ్ధంలో పడింది. రోహిత్పై వేటు పడితే, ఆ ప్రభావం మిగిలిన ఇద్దరు సీనియర్లపై కూడా కచ్చితంగా పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2027 ప్రపంచకప్లో వీరి స్థానాలకు ఎలాంటి గ్యారెంటీ లేదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..