
ROKO : టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను మళ్లీ బ్లూ జెర్సీలో చూడాలంటే అభిమానులు కొన్నాళ్ల పాటు ఎదురుచూడక తప్పదు. న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ ముగిసిన తర్వాత, ఈ ఇద్దరు దిగ్గజాలు సుమారు ఆరు నెలల పాటు అంతర్జాతీయ వన్డే క్రికెట్కు దూరం కానున్నారు. ఆదివారం (జనవరి 18, 2026) ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరగనున్న మూడో వన్డే ఈ ఏడాదిలో వారిద్దరూ కలిసి ఆడే చివరి వన్డే మ్యాచ్ కానుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ చివరి దశకు చేరుకుంది. ఈ సిరీస్ తర్వాత భారత జట్టు కివీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. అయితే రోహిత్, విరాట్ ఇప్పటికే టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనివల్ల వారు టీ20 సిరీస్లో కనిపించరు. ఆ తర్వాత జరిగే ఐపీఎల్ 2026, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో కూడా వారు తమ తమ బాధ్యతల్లో బిజీగా ఉంటారు కానీ, టీమిండియా తరపున వన్డేలు ఆడే అవకాశం ఉండదు.
మళ్లీ ఎప్పుడు మైదానంలోకి దిగుతారు?
న్యూజిలాండ్ సిరీస్ ముగిసిన తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం జూన్ 2026లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు భారత్ పర్యటనకు రానుంది. మూడు వన్డేల సిరీస్ కోసం వచ్చే ఆఫ్ఘన్లతో తలపడే క్రమంలో రోహిత్, విరాట్ మళ్లీ భారత జెర్సీలో కనిపిస్తారు. అయితే అప్పటి సీనియర్ల ఫిట్నెస్, సెలక్టర్ల నిర్ణయంపై ఇది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వారికి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే ఈ నిరీక్షణ ఇంకా పెరిగే అవకాశం ఉంది.
2026లో టీమిండియా వన్డే షెడ్యూల్ ఇదే
ఆఫ్ఘనిస్థాన్ సిరీస్ తర్వాత జూలైలో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో సిరీస్ ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అది జరుగుతుందా లేదా అన్నది అనుమానమే. అదే నెలలో వెస్టిండీస్ పర్యటన (3 వన్డేలు), అక్టోబర్-నవంబర్ నెలల్లో తిరిగి న్యూజిలాండ్ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. కాబట్టి ఈ ఏడాది ద్వితీయార్థంలో వన్డే క్రికెట్ సందడి ఎక్కువగా ఉండనుంది.
ఇండోర్ మ్యాచ్ ఎందుకు కీలకం?
చాలా కాలం తర్వాత వన్డే ఫార్మాట్ ఆడుతున్న రోహిత్, విరాట్ ఈ విరామానికి ముందు తమ బ్యాట్లకు పని చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇండోర్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ మ్యాచ్ ద్వారా తమ అభిమానులకు మంచి విందు భోజనం లాంటి ఇన్నింగ్స్ అందించాలని హిట్ మ్యాన్, కింగ్ కోహ్లీ భావిస్తున్నారు.