
IPL 2026 RCB : ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయాల జోరు చూస్తుంటే ఈసారి కూడా కప్పు కొట్టేలాగే కనిపిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఆడిన రెండు మ్యాచుల్లోనూ అదిరిపోయే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో గంభీరంగా నంబర్-1 స్థానంలో కూర్చుంది. అయితే, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ, ఈసారి ఆర్సీబీ సక్సెస్ వెనుక అసలైన కారణం మరో ఐదుగురు ఆటగాళ్లు. వీరంతా ‘లో కాస్ట్.. హై పర్ఫామెన్స్’ అన్నట్లుగా ప్రత్యర్థి జట్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు.
సాధారణంగా ఐపీఎల్లో స్టార్ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరిస్తాయి. కానీ బెంగళూరు మేనేజ్మెంట్ ఈసారి చాలా తెలివిగా వ్యవహరించింది. కేవలం 11 కోట్ల రూపాయల లోపే ఐదుగురు మ్యాచ్ విన్నర్లను జట్టులోకి తెచ్చుకుంది. ఈ ఐదుగురు ఇప్పుడు ఆడుతున్న తీరు చూస్తుంటే.. పెట్టిన పెట్టుబడికి వంద రెట్లు లాభం వచ్చినట్లేనని విశ్లేషకులు అంటున్నారు. వీరు కేవలం తక్కువ ధరకే వచ్చారు కదా అని తక్కువ అంచనా వేస్తే.. మైదానంలో పరుగుల వరద పారించడమే కాదు, వికెట్ల వేటలోనూ తగ్గేదేలే అంటున్నారు.
ఎవరూ ఆ ఐదుగురు ‘బడ్జెట్’ హీరోలు?
ఆర్సీబీ విజయాల్లో కీ రోల్ పోషిస్తున్న ఆ ఐదుగురు ఆటగాళ్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీరందరి మొత్తం విలువ కేవలం రూ.11.10 కోట్లు మాత్రమే.
ట్రిమ్ డేవిడ్ (రూ.3 కోట్లు): చెన్నైపై 25 బంతుల్లోనే 70 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఆఖరి ఓవర్లలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఫినిషర్గా తన సత్తా చాటుతున్నాడు.
దేవదత్ పడిక్కల్ (రూ.2 కోట్లు): లోకల్ బాయ్ మళ్ళీ తన ఫామ్లోకి వచ్చాడు. వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాది (ఎస్ఆర్హెచ్పై 61, సిఎస్కేపై 50) టాప్ ఆర్డర్లో వెన్నెముకలా నిలుస్తున్నాడు.
జాకబ్ డఫీ (రూ.2 కోట్లు): బౌలింగ్లో మ్యాజిక్ చేస్తున్నాడు. హైదరాబాద్పై కేవలం 22 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
రొమారియో షెపర్డ్ (రూ.1.50 కోట్లు): బేస్ ప్రైస్కే దొరికిన ఈ ఆల్రౌండర్.. ఎస్ఆర్హెచ్పై 3 వికెట్లు తీసి తన విలువను చాటుకున్నాడు.
జాకబ్ బెథెల్ (రూ.2.60 కోట్లు): యంగ్ ప్లేయర్ బెథెల్ కూడా తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ టీమ్ బ్యాలెన్స్ను పెంచుతున్నాడు.
రికార్డు విజయాలతో దూసుకుపోతున్న ఆర్సీబీ
మొదటి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించిన ఆర్సీబీ, కేవలం 26 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. దీనివల్ల నెట్ రన్ రేట్ భారీగా పెరిగింది. ఇక రెండో మ్యాచ్లో దాయాది జట్టు చెన్నై సూపర్ కింగ్స్ను 43 పరుగుల తేడాతో చిత్తు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ లాంటి సీనియర్లు ఒకవైపు రాణిస్తుంటే.. ఈ తక్కువ బడ్జెట్ ప్లేయర్లు మరోవైపు ఆదుకుంటున్నారు. దీనివల్ల ఆర్సీబీకి ఎక్కడా లోటు లేకుండా పోయింది.
విజేతల జట్టుగా ఆవిర్భావం
గత సీజన్ ఛాంపియన్ అయిన బెంగళూరు, ఈసారి కూడా అదే ఊపును కొనసాగిస్తోంది. ముఖ్యంగా హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో వరుసగా రెండు విజయాలు సాధించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ ఐదుగురు ఆటగాళ్లు ఇదే ఫామ్ను కొనసాగిస్తే, మళ్ళీ కప్పు ఆర్సీబీ చేతికి రావడం పెద్ద కష్టమేమీ కాదని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తక్కువ బడ్జెట్ తో టీమ్ ను ఇంత బలంగా నిర్మించిన మేనేజ్ మెంట్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి