IND vs WI: తొలి టెస్టులో టీమిండియాదే విజయం.. అశ్విన్ ముందు 2 ఇన్నింగ్స్‌ల్లోనే చేతులెత్తేసిన కరేబియన్లు..

|

Jul 15, 2023 | 6:50 AM

IND vs WI 1st Test: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ తొలి రెండు ఎడిషన్‌లలోనూ ఓడిన భారత్.. మూడో సీజన్‌ని అద్భుతమైన విజయంతో ప్రారంభించింది. డొమినికా వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఒక ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో..

IND vs WI: తొలి టెస్టులో టీమిండియాదే విజయం.. అశ్విన్ ముందు 2 ఇన్నింగ్స్‌ల్లోనే చేతులెత్తేసిన కరేబియన్లు..
IND vs WI 1st Test
Follow us on

IND vs WI 1st Test: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ తొలి రెండు ఎడిషన్‌లలోనూ ఓడిన భారత్.. మూడో సీజన్‌ని అద్భుతమైన విజయంతో ప్రారంభించింది. డొమినికా వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఒక ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో కరేబియన్లపై గెలుపొందింది. దీంతో 2 టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆడిన కరేబియన్లపై టీమిండియా స్పిన్ మాస్టర్ రవిచంద్రన్ అశ్విన్ 12 వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో ఆశ్విన్ విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో  7 వికెట్లు పడగొట్టి స్టార్‌గా నిలిచాడు. అతని ముందు విండీస్ ప్లేయర్లు రెండు సందర్భాల్లోనూ నిలవలేకపోయారు. అలాగే ఆరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగిన యశస్వీ జైస్వాల్(171), కెప్టెన్‌గా సెంచరీతో ముందుండి నడిపిన రోహిత్ శర్మ(103), అర్థసెంచరీతో రాణించిన విరాట్ కోహ్లీ(76) సూపర్ ఇన్నింగ్స్.. బౌలింగ్‌లో ఆశ్విన్‌కి తోడు రవీంద్ర జడేజా తీసిన 5 వికెట్లు(3, 2) కూడా భారత్ విజయంలో ముఖ్యపాత్ర పోషించాయి.

ఇక విండీస్ ప్లేయర్లలో ఒక్కరూ ఆశించిన మేరకు రాణించలేదు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆలిక్ అథనాజే 47, 28 పరుగులతో విండీస్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శివనారాయన్ చంద్రపాల్ వారసుడిగా వచ్చిన జూనియర్ చంద్రపాల్ కూడా విండీస్ టీమ్‌ని ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. విశేషం ఏమిటంటే.. భారత బ్యాటర్లపైకి విండీస్ టీమ్ తరఫున తేజ్‌నారాయణ్ చందర్‌పాల్, జోషువా డ సిల్వా(వికెట్ కీపర్) మినహా మిగిలి 9 మంది బౌలింగ్ అవతారమెత్తారు.  కానీ వారిలో ఎవరూ భారత బ్యాటర్ల ముందు నిలవలేకపోయారు.

కాగా, తొలి బ్యాటింగ్ చేసిన విండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు కుప్పకూలింది. అనంతరం క్రీజులోకి వచ్చిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసి.. 271 పరుగుల ఆధిక్యంతో తమ ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది. దీంతో 272 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ ప్లేయర్లు అందులోనూ విఫలమయ్యారు. ఆశ్విన్ 7, జడేజా 2 వికెట్లతో చెలరేగడంతో 130 పరుగులకే పరిమితమయ్యారు. ఫలితంగా తొలి టెస్టులో విజయం భారత్ సొంతమయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..