టీమిండియా వెనుక రియల్ హీరో ఇతనే.. నెలకు రూ.100 తో మొదలై 50 మందికి స్ఫూర్తిగా నిలిచి..!

Team India masseur: చేతిలో కేవలం వంద రూపాయల జీతం. ఢిల్లీ వీధుల్లో కాలి నడక. కానీ ఇప్పుడతను కోహ్లీ, రోహిత్, ధోనీ లాంటి క్రికెట్ దిగ్గజాలకు అత్యంత ఆత్మీయుడు. టీమిండియా ఫిట్‌నెస్ వెనుక ఉన్న అదృశ్య శక్తి ఈ రాజీవ్ కుమార్. నెలకు వంద రూపాయలతో మొదలైన అతని స్ఫూర్తిదాయక ప్రయాణం, ఈరోజు తన ఊరిలోని యాభై మందికి మార్గదర్శిగా ఎలా మారిందో తెలుసుకోండి.

టీమిండియా వెనుక రియల్ హీరో ఇతనే.. నెలకు రూ.100 తో మొదలై 50 మందికి స్ఫూర్తిగా నిలిచి..!
Team India Masseur Rajeev Kumar

Updated on: Jul 30, 2026 | 9:45 AM

Team India Masseur: ఢిల్లీ వీధుల్లో 2002లో అడుగుపెట్టిన రాజీవ్ కుమార్ లక్ష్యం చాలా చిన్నది. నెలకు ఏదో ఒక స్థిరమైన ఆదాయం సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవాలన్నదే అతని తాపత్రయం. జోధ్‌పూర్ యూనివర్సిటీ నుంచి మసాజ్ థెరపీలో డిప్లొమా పూర్తి చేసిన అతనికి, మొదట్లో నెలకు కేవలం వంద రూపాయల జీతంతో చిన్న ఉద్యోగం దొరికింది. బస్సులు ఎక్కుతూ, ఎన్నో కిలోమీటర్లు కాలిబాటన నడుస్తూ తీవ్రంగా శ్రమించాడు. కనీసం సొంతంగా ఒక మొబైల్ ఫోన్ కొనుక్కునే స్తోమత కూడా అప్పట్లో అతనికి లేదు. ఎవరో దయతలచి అతనికి ఒక నోకియా 1100 ఫోన్ కొనిచ్చారు. ఐదేళ్ల పాటు స్థిరమైన ఉద్యోగం దొరకకపోయినా అతడు ఏనాడూ వెనకడుగు వేయలేదు. అప్పట్లో అంత కష్టాలు పడుతున్నప్పుడు, భవిష్యత్తులో తాను టీమిండియాతో ప్రపంచమంతా తిరుగుతానని కలలో కూడా ఊహించలేదని రాజీవ్ ఎమోషనల్ అయ్యాడు.

కెరీర్ మార్చేసిన ఆశిష్ నెహ్రా..

రాజీవ్ జీవితంలోకి ఒక దేవదూతలా వచ్చాడు భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా. నెహ్రా గాయాల పాలై కోలుకుంటున్న సమయంలో, రాజీవ్ తన మసాజ్ థెరపీతో అతనికి అండగా నిలిచాడు. నెహ్రాకు ఎండలో మసాజ్ చేయించుకోవడం ఇష్టం కావడంతో, గంటల తరబడి ఇంటి పైకప్పు మీదే అతనికి చికిత్స అందించేవాడు. రాజీవ్ పడే కష్టం, అతని చేతుల్లో ఉన్న మ్యాజిక్ నెహ్రాకు బాగా నచ్చాయి. “ఈరోజు నేనీ స్థాయిలో ఉన్నానంటే దానికి ఆశిష్ నెహ్రానే ప్రధాన కారణం. నా కెరీర్‌కు ముఖ్యమైన తలుపులన్నీ ఆయనే తెరిచాడు” అని రాజీవ్ ఎంతో కృతజ్ఞతగా చెబుతాడు.

ఇది కూడా చదవండి: ఆ నలుగురు చెత్త ఫీల్డర్లను పీకేయండి.. ఇంకెన్నాళ్లు దాచిపెడతారు..: బీసీసీఐపై గవాస్కర్ ఫైర్..!

ఇవి కూడా చదవండి

డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్.. కుల్దీప్‌కు అవార్డు!

గత ఎనిమిదేళ్లలో నలుగురు భారత కెప్టెన్లతో రాజీవ్ కలసి పనిచేశాడు. ఎంఎస్ ధోనీతో తనకున్న అనుబంధాన్ని రాజీవ్ ఎప్పటికీ మర్చిపోలేడు. జట్టులోకి కొత్తగా వచ్చినప్పుడు ధోనీ ఎంతో ఆప్యాయంగా పలకరించి, రాజీవ్ భయం పోగొట్టాడు. “రాజీవ్ భాయ్ ఎలాంటి టెన్షన్ పడొద్దు, ప్రశాంతంగా పని చేసుకో. ఎప్పుడైనా నా గది తలుపులు నీకోసం తెరిచే ఉంటాయి” అని ధోనీ చెప్పిన మాటలు అతనికి కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. ఆ రోజు ధోనీ స్వయంగా రాజీవ్‌ను డిన్నర్‌కు కూడా తీసుకెళ్లాడు. ఇక మహ్మద్ సిరాజ్, షమీలతో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఎప్పుడూ రాజీవ్ కోసం ఎదురుచూసేవారు. కుల్దీప్ అయితే అందరికంటే ఎక్కువగా మసాజ్ చేయించుకునేవాడని, అతనికి ఏకంగా ఒక అవార్డు ఇవ్వొచ్చని రాజీవ్ సరదాగా కామెంట్ చేశాడు. కరోనా కష్టకాలంలో మొత్తం జట్టు తనకు అండగా నిలిచి ఆర్థిక సాయం చేసిందని ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు.

ఒక్కరితో మొదలై.. 50 మంది దాకా..!

రాజీవ్ సాధించిన విజయం కేవలం అతనికి మాత్రమే పరిమితం కాలేదు. అతన్ని ఆదర్శంగా తీసుకుని అతని సొంత ఊరి నుంచి ఏకంగా 50 మంది యువతీ యువకులు మసాజ్ థెరపీ వృత్తిలోకి అడుగుపెట్టారు. వారిలో కొందరు ఐపీఎల్ జట్లతో, కొందరు రంజీ జట్లతో, ఇంకొందరు ఏకంగా భారత జట్టుతోనే కలిసి పనిచేస్తున్నారు. మరికొందరు యోగా, ఆయుర్వేద రంగాల్లో స్థిరపడ్డారు. ఎప్పుడైనా సొంత ఊరికి వెళ్ళినప్పుడు అక్కడి జనాలు చూపే అభిమానం తనకు దొరికిన ఏ పతకం కన్నా తక్కువేమీ కాదని రాజీవ్ గర్వంగా చెబుతున్నాడు.

ఇది కూడా చదవండి: ఐపీఎల్ ఆడకముందే టీమిండియాలోకి పిలుపు.. కట్ చేస్తే.. బెంచ్‌కే పరిమితమైన ఐదుగురు అన్ లక్కీ ప్లేయర్లు..!

నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, చేతి వృత్తినే నమ్ముకుని ప్రపంచస్థాయి క్రికెటర్ల నమ్మకాన్ని గెలుచుకున్న రాజీవ్ కుమార్ ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. కష్టం, నిజాయితీ ఉంటే జీవితంలో ఏ స్థాయికైనా ఎదగవచ్చని అతని జీవితం మనకు స్పష్టంగా చెబుతోంది. తెరవెనుక ఉంటూ టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను కాపాడుతున్న ఇలాంటి వ్యక్తులే నిజమైన హీరోలు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us