
Sunrisers Hyderabad vs RCB: ఐపీఎల్ 19వ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి ఫైనల్కు దూసుకెళ్లింది. ధర్మశాల వేదికగా జరిగిన తొలి క్వాలిఫైయర్ పోరులో గుజరాత్ టైటాన్స్ను 92 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. కెప్టెన్ రజత్ పాటిదార్ వీర విహారానికి బౌలర్ల పదునైన వ్యూహాలు తోడవడంతో బెంగళూరు ఏకపక్ష విజయాన్ని అందుకుంది.
ఈ చారిత్రాత్మక మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మైదానంలో పరుగుల వరద పారించాడు. గుజరాత్ బౌలర్లను సునామీలా చుట్టుముడుతూ కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పాటిదార్ ఆడిన ఈ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆర్సీబీ భారీ స్కోరు సాధించడానికి బలమైన పునాది వేసింది. బెంగళూరు బ్యాటర్లందరూ వచ్చిన వారు వచ్చినట్లుగా బంతిని సరిహద్దులు దాటించడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.
256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ను ఆర్సీబీ బౌలర్లు ఆరంభం నుంచే ఊపిరి ఆడనివ్వలేదు. మ్యాచ్కు ముందే ఆర్సీబీ సిద్ధం చేసుకున్న పక్కా వ్యూహాలు మైదానంలో అద్భుతంగా పనిచేశాయి. గుజరాత్ జట్టుకు ప్రధాన బలమైన టాప్ ఆర్డర్ను పవర్ ప్లేలోనే దెబ్బకొట్టాలని నిర్ణయించుకున్న బెంగళూరు, దానికి తగ్గట్లే బౌలింగ్ను ప్రయోగించింది.
ముఖ్యంగా ప్రమాదకరమైన బ్యాటర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ వికెట్లను వెంటవెంటనే పడగొట్టి గుజరాత్ నడుం విరిచారు. రాహుల్ తెవాటియా మినహా గుజరాత్ బ్యాటర్లలో ఎవరూ క్రీజులో నిలబడలేకపోయారు. ఆర్సీబీ బౌలర్ల ధాటికి గుజరాత్ జట్టు మరో మూడు బంతులు మిగిలి ఉండగానే కేవలం 162 పరుగులకే కుప్పకూలింది.
భారీ విజయం అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ జట్టు ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశాడు. “ఇది నిజంగా ఒక అద్భుతమైన మ్యాచ్. ఫైనల్ చేరాలనే పట్టుదలతో ప్రతి ఒక్కరం ఆడాం. మా బ్యాటర్లు చూపించిన ఆధిపత్యం అమోఘం. వాస్తవానికి బ్యాటింగ్లో ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేవు, కానీ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేయాలనే బలమైన సంకల్పంతో బరిలోకి దిగాం” అని తెలిపాడు.
తన ఇన్నింగ్స్ గురించి చెప్తూ, “ప్రారంభంలో పిచ్ ఎలా స్పందిస్తుందోనని ఓ 8 నుంచి 10 బంతులు నెమ్మదిగా ఆడాను. ఆ తర్వాత పరిస్థితులపై క్లారిటీ రావడంతో నా సహజ సిద్ధమైన ఆటను బయటకు తీశాను. పిచ్ ఎలా ఉన్నా భయపడకుండా ఆడటమే నా శైలి” అని పాటిదార్ వివరించాడు.
గుజరాత్పై విజయం సాధించి నేరుగా ఫైనల్కు వెళ్లినప్పటికీ, రాబోయే సవాలుపై రజత్ పాటిదార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “గుజరాత్తో మ్యాచ్ విషయానికి వస్తే వారి టాప్ త్రీ వికెట్లు తీస్తే మ్యాచ్ మా వైపు తిరుగుతుందని తెలుసు. కానీ ఒకవేళ ఫైనల్లో మాకు సన్రైజర్స్ హైదరాబాద్ ఎదురైతే మాత్రం గట్టి పోటీ తప్పదు. సన్రైజర్స్ బ్యాటింగ్ విభాగం చాలా బలంగా ఉంది. గుజరాత్లా ముగ్గురితో కాకుండా, హైదరాబాద్ జట్టులోని ఐదు ఆరుగురు బ్యాటర్లను మేము తీవ్రంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని పాటిదార్ విశ్లేషించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..