
R Ashwin, 2027 ODI World Cup: దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల వేదికగా జరిగే 2027 వన్డే ప్రపంచకప్కు భారత్ ఇప్పటి నుంచే సన్నాహకాలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన డ్రీమ్ టీమ్ను ప్రకటించి ఒక్కసారిగా సంచలనం సృష్టించాడు. రిషభ్ పంత్ వంటి కీలక స్టార్లకు షాక్ ఇస్తూ, అందరూ మర్చిపోయిన సీనియర్ పేసర్ను బరిలోకి దించాలని ప్రతిపాదించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఒక స్పెషల్ టాక్ షోలో పాల్గొన్న అశ్విన్, యెస్-నో-మేబీ ఫార్మాట్లో ప్రతి ఆటగాడి అర్హతను విశ్లేషించాడు. జట్టులో సీనియర్ల పాత్ర ఎంతైనా అవసరమని చెప్తూ కెప్టెన్ రోహిత్ శర్మ, రన్ మెషిన్ విరాట్ కోహ్లీలకు స్పష్టమైన ఓటు వేశాడు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ లతో పాటు ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్లను ఎంపిక చేశాడు. అయితే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబేలను జట్టు నుంచి పూర్తిగా పక్కన పెట్టేయడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
అశ్విన్ ఎంపిక చేసిన బృందంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్కు ఆయన మద్దతు పలకడం. 2022 తర్వాత భారత జట్టుకు దూరమైన భువీని దక్షిణాఫ్రికా మైదానాల్లో కచ్చితంగా ఆడించాలని ఆయన ప్రతిపాదించాడు. గతేడాది ఐపీఎల్లో ఆర్సీబీ విజయంలో భువీ 28 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. అక్కడ స్వింగ్ పిచ్లకు భువీ అనుభవం ఎంతగానో పనికొస్తుందని, దేశవాళీ టోర్నీలన్నీ ఆడించి అతన్ని సన్నద్ధం చేయాలని అశ్విన్ కోరాడు.
ఇది కూడా చదవండి: WTC ఫైనల్ రేస్ నుంచి పాక్తోపాటు టీమిండియా ఔట్.. ఇలా జరిగితేనే గిల్ సేనకు ఛాన్స్..?
జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ లతో పాటు యువ బౌలర్ హర్షిత్ రాణాను అశ్విన్ తన ప్రధాన బౌలింగ్ విభాగంలో చేర్చాడు. కాగా యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లను ‘రేసులో ఉన్నారు కానీ ఇంకా నిరూపించుకోవాలి’ అని పేర్కొన్నాడు. మెగా టోర్నీకి ఇంకా సమయం ఉంది కాబట్టి రాబోయే సిరీస్లలో వీరి ప్రదర్శనే వారి భవితవ్యాన్ని తేలుస్తుందని స్పష్టం చేశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..