On This Day: 141 ఫోర్లు, 13 సిక్సర్లతో 1089 పరుగులు.. 6గురి బౌలర్ల ఊచకోత.. టీమిండియా బ్యాటర్ల విధ్వంసం..

|

Jan 16, 2023 | 5:33 PM

అది పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్. టీమిండియా బ్యాటర్లు ఊచకోత కోశారు. దాదాపుగా 50 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసేంతలా చేరువై.. చివరికి పెవిలియన్ చేరారు.

On This Day: 141 ఫోర్లు, 13 సిక్సర్లతో 1089 పరుగులు.. 6గురి బౌలర్ల ఊచకోత.. టీమిండియా బ్యాటర్ల విధ్వంసం..
Team India
Follow us on

అది పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్. టీమిండియా బ్యాటర్లు ఊచకోత కోశారు. దాదాపుగా 50 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసేంతలా చేరువై.. చివరికి పెవిలియన్ చేరారు. ఇదంతా పాకిస్తాన్‌లోని గడ్డాఫీ స్టేడియంలో 16 ఏళ్ల కిందట జరిగింది.  ఇక ఆ రికార్డుకు దగ్గరగా వెళ్లింది వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్. లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో 1956వ సంవత్సరంలో భారత్‌కు చెందిన పంకజ్ రాయ్, వినూ మన్‌కంద్‌లు తొలి వికెట్‌కు 413 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ రికార్డును సెహ్వాగ్, ద్రవిడ్‌లు బ్రేక్ చేస్తారని అప్పట్లో అందరూ భావించారు. కానీ సీన్ కట్ చేస్తే.. ఆ రికార్డుకు చేరువలోకి వచ్చి.. ఆఖర్లో నిరాశపరిచారు.

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసి.. మొదటి ఇన్నింగ్స్‌ను ఏడు వికెట్లు కోల్పోయి 679 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్‌గా సెహ్వాగ్‌తో కలిసి ద్రవిడ్ బరిలోకి దిగాడు. ఒక ఎండ్ నుంచి సెహ్వాగ్ వేగంగా పరుగులు సాధిస్తే, ద్రవిడ్ ఆచితూచి ఆడుతూ వికెట్ పడకుండా చూసుకున్నాడు. నాలుగో రోజు అంటే 2006, జనవరి 16న ఆట ముగిసే సమయానికి ఈ జోడీ 400 పరుగుల మార్కును దాటింది. దీంతో ఈ జోడీ టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో రెండో అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్ జోడీగా రికార్డుల్లోకి ఎక్కింది. అలాగే 1972 ఏప్రిల్‌లో వెస్టిండీస్‌పై మొదటి వికెట్‌కు 387 పరుగులు జోడించిన న్యూజిలాండ్ జోడీ గ్లెన్ టర్నర్, టెర్రీ జార్విస్‌ రికార్డును కూడా బ్రేక్ చేసింది. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఎలాంటి వికెట్ నష్టపోకుండా 403 పరుగులు చేసింది.

మూడు పరుగుల తేడాతో ప్రపంచ రికార్డు మిస్..

ద్రవిడ్, సెహ్వాగ్ జోడీ పంకజ్, వినూల రికార్డును ఐదో రోజు బద్దలు కొడుతుందని అందరూ ఊహించారు కానీ అది కుదరలేదు. మ్యాచ్ చివరి రోజు అంటే జనవరి 17న ఐదో రోజు స్కోరు 410 పరుగుల వద్ద ఉండగా రాణా బౌలింగ్‌లో సెహ్వాగ్ పెవిలియన్ చేరాడు. మొత్తంగా సెహ్వాగ్ 247 బంతులు ఎదుర్కొని 254 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 47 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. పొగమంచు కారణంగా ఆట సాధ్యం కాకపోవడంతో చివరి రోజు కేవలం 14 బంతులు మాత్రమే పడ్డాయి. ఆపై మ్యాచ్ డ్రాగా ముగిసింది. మరోవైపు ద్రవిడ్ 233 బంతుల్లో 19 ఫోర్ల సహాయంతో అజేయంగా 128 పరుగులు సాధించాడు.