
India Women Squad T20 World Cup 2026: భారత మహిళల క్రికెట్లో ఇప్పుడు నందినీ శర్మ పేరు మారుమోగుతోంది. 2001 సెప్టెంబర్ 20న చండీగఢ్లో జన్మించిన ఈమె, కేవలం 20 లక్షల రూపాయల కనీస ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరింది. అయితే తన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. 2026 మహిళల ప్రీమియర్ లీగ్లో ఆడిన పది మ్యాచ్లలో ఏకంగా 17 వికెట్లు పడగొట్టి తన ప్రతాపాన్ని చాటింది. అదే లీగ్లో హ్యాట్రిక్ వికెట్లు, ఐదు వికెట్ల ఘనతను సాధించిన తొలి భారతీయ బౌలర్గా నందినీ చరిత్ర సృష్టించింది.
గతేడాది భారత్కు తొలి వన్డే ప్రపంచకప్ను అందించిన హర్మన్ప్రీత్ కౌర్ ఈసారి టీ20 ప్రపంచకప్పై కన్నేసింది. ఆమెకు సహాయకురాలిగా స్మృతి మంధాన వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టనుంది. జూన్ 12 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఈ మహా సంగ్రామం కోసం భారత జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ వంటి తుఫాన్ బ్యాటర్లు ఉండగా, బౌలింగ్ బాధ్యతలను దీప్తి శర్మ, రేణుకా సింగ్ భుజానికెత్తుకోనున్నారు.
జట్టు ఎంపికలో గాయాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కీలక ఆటగాళ్లు కాశ్వి గౌతమ్, అమంజోత్ కౌర్ గాయాల కారణంగా ఈ టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది. అలాగే ప్రతిభావంతురాలైన ప్రతిక రావల్ టీ20 జట్టులో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే, ఆమెను ఇంగ్లాండ్తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్ కోసం సెలెక్టర్లు ఎంపిక చేశారు. ప్రపంచకప్కు ముందు మే 28 నుంచి ఆతిథ్య ఇంగ్లాండ్తో భారత్ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా ఆడనుంది.
భారత టీ20 ప్రపంచకప్ జట్టు ఇదే: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), శ్రీ చరణి, యాస్తికా భాటియా, నందినీ శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..