స్వదేశం వద్దంటే.. ముంబై రమ్మంది! వచ్చే ఐపీఎల్‌ కోసం ముంబై ఇండియన్స్‌లోకి స్టార్‌ స్పిన్నర్‌

ఓ స్టార్‌ ప్లేయర్‌ను ఆ దేశపు జట్టులోకి తీసుకోలేదు. కానీ, వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ కోసం ముంబై ఇండియన్స్‌ మాత్రం అతన్ని అక్కున చేర్చుకుంది. ఆ ప్లేయర్‌ను స్వదేశం వద్దన్నా.. ముంబై రూపంలో అదృష్టం తలుపుతట్టింది. మరి ఆ లక్కీ ప్లేయర్‌ ఎవరు? ముంబై ఎందుకు అతన్ని తీసుకుందో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

స్వదేశం వద్దంటే.. ముంబై రమ్మంది! వచ్చే ఐపీఎల్‌ కోసం ముంబై ఇండియన్స్‌లోకి స్టార్‌ స్పిన్నర్‌
Mujeeb Ur Rahman Am Ghazanf

Updated on: Feb 16, 2025 | 1:21 PM

ఐపీఎల్‌ 2025 సీజన్‌ మరింతో దూరంలో లేదు. మార్చ్‌ 22 నుంచి ఈ మెగా సీజన్‌ మొదలుకానుంది. ఈ సీజన్‌ కోసం ముంబై ఇండియన్స్‌లో ఆడేందుకు ఓ మిస్టరీ స్పిన్నర్‌ వచ్చేశాడు. అదేంటి ఆల్రెడీ రిటెన్షన్‌, మెగా ఆక్షన్‌తో ముంబై ఇండియన్స్‌ టీమ్‌ రెడీ అయిపోయిందిగా? మళ్లీ ఇంకో ప్లేయర్‌ రావడం ఏంటీ అనుకుంటున్నారా? నిజమే ముంబై స్క్వౌడ్‌ ఎప్పుడో రెడీ అయిపోయింది కానీ, తాజాగా ఓ ప్లేయర్ గాయపడ్డాడు. అతను వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ వరకు కోలుకునే పరిస్థితి లేదు. అందుకోసమే అతని స్థానంలో రీప్లేస్‌మెంట్‌గా మరో ప్లేయర్‌ తమ స్క్వౌడ్‌లోకి తీసుకుంది ముంబై ఇండియన్స్‌. ఆ ప్లేయర్‌ మరెవరో కాదు ఆఫ్ఘనిస్థాన్‌ స్టార్‌స్పిన్నర్‌ ముజీబ్‌ ఉర్‌ రహెమాన్‌.

ముంబై ఎంతో స్ట్రాటజీతో ఏకంగా రూ.4.8 కోట్లు పెట్టి ఓ కుర్ర మిస్టరీ స్పిన్నర్‌ ఏఎం ఘజన్‌ఫర్‌ను ఐపీఎల్‌ మెగా వేలంలో కొనుగోలు చేసింది. అతను కూడా ఆఫ్ఘనిస్థాన్‌ ప్లేయరే. కేవలం 18 ఏళ్ల కుర్రాడు. తొలిసారి ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ అందుకున్నాడు. అది కూడా ముంబై లాంటి సక్సెస్‌ఫుల్‌ ఫ్రాంచైజీలో చోటు దక్కించుకున్నాడు. కానీ, దురదృష్టవశాత్తు సీజన్‌ ఆరంభం కాకముందే గాయంతో వచ్చే సీజన్‌కు పూర్తిగా దూరం అయ్యాడు. దీంతో వేరే దారి లేక అతని స్థానంలో అదే దేశానికి చెందిన ముజీబ్‌ను ముంబై ఇండియన్స్‌ తమ టీమ్‌లోకి తీసుకుంది. అయితే.. ముజీబ్‌ ఉర్‌ రహెమాన్‌ను ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు మరో మూడు రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 కోసం ఎంపిక చేయలేదు. అతని స్థానంలో ఏఎం ఘజన్‌ఫర్‌ను ఛాంపియన్స్‌ ట్రోఫీ స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. కానీ, అతను గాయం కారణంగా ఛాంపియన్స్‌ ట్రోఫీకి దూరం అయ్యాడు. అతని ప్లేస్‌లో ముజీబ్‌ను కాకండా నంగేయాలియా ఖరోటే అనే ప్లేయర్‌ను ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం తీసుకుంది.

ఇలా ఆఫ్ఘనిస్థాన్‌ జట్టు తమ టీమ్‌లో అవసరం లేదనుకున్న ప్లేయర్‌ను ఇప్పుడు ముంబై తీసుకుంది. అయితే ఛాంపియన్స్‌ ట్రోఫీ వన్డే ఫార్మాట్‌లో జరుగుతున్న టోర్నీ, ఐపీఎల్‌ టీ20 ఫార్మాట్‌లో జరిగే టోర్నీ కావడంతో ఆ లెక్కలేమీ ముంబై పరిగణంలోకి తీసుకోలేదు. ఇలా ముజీబ్‌ను స్వదేశం వద్దనుకన్నా.. ముంబై ఇండియన్స్‌ రూపంలో అతనికి అదృష్టం కలిసి వచ్చింది. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ చాలా స్ట్రాంగ్‌ టీమ్‌తో బరిలోకి దిగబోతుంది. గత కొన్ని సీజన్లుగా ముంబై ప్రదర్శన ఫేలవంగా ఉండటంతో, 2025లో ఎలాగైనా 6వ కప్పు కొట్టాలనే కసితో బరిలోకి దిగబోతుంది. దానికి ముజీబ్‌ ఏమేరకు పనికొస్తాడో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.