MI vs GT: నేడు ఆర్‌సీబీ వర్సెస్ గుజరాత్.. గిల్ 59.. కోహ్లీ 77.. ఎవరు టార్గెట్ రీచ్ అవుతారు?

MI vs GT: ఐపీఎల్ 2026 ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ మధ్య పోరు నెలకొంది. నేడు జరగనున్న ఆర్‌సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్‌లో ఎవరు అగ్రస్థానానికి చేరుతారో చూడాలి. వీరిద్దరిలో నేడు ఎవరు ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

MI vs GT: నేడు ఆర్‌సీబీ వర్సెస్ గుజరాత్.. గిల్ 59.. కోహ్లీ 77.. ఎవరు టార్గెట్ రీచ్ అవుతారు?
Kohli And Gill

Updated on: Apr 24, 2026 | 8:11 AM

MI vs GT: ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. లీగ్ సగం ముగిసే సమయానికి పాయింట్ల పట్టికతో పాటు ఆరెంజ్ క్యాప్ రేసులో కూడా తీవ్రమైన పోటీ నెలకొంది. నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న 34వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు ఇద్దరు స్టార్ బ్యాటర్లు.. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ మీదనే ఉన్నాయి. వీరిద్దరిలో నేడు ఎవరు ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

విరాట్ కోహ్లీ పరిస్థితి ఏంటి?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 49.40 సగటుతో 247 పరుగులు చేశాడు. కోహ్లీ టాప్-5లోకి రావాలంటే కేవలం 8 పరుగులు చేస్తే సరిపోతుంది. కానీ, నంబర్-1 స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ అభిషేక్ శర్మ (323 పరుగులు)ను దాటాలంటే కోహ్లీ నేటి మ్యాచ్‌లో కనీసం 77 పరుగులు చేయాల్సి ఉంటుంది. చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్‌కు స్వర్గధామం కావడంతో కోహ్లీ ఫ్యాన్స్ ఆయన నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు.

శుభ్‌మన్ గిల్ ముందున్న సవాల్

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం 5 మ్యాచ్‌ల్లో 53 సగటుతో 265 పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉన్నాడు. గిల్, అభిషేక్ శర్మల మధ్య 58 పరుగుల తేడా ఉంది. అంటే గిల్ నేడు 59 పరుగులు చేస్తే ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా అగ్రస్థానానికి చేరుకుంటాడు. గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం, బెంగళూరు బౌలింగ్ కాస్త బలహీనంగా కనిపిస్తుండటం ఆయనకు కలిసివచ్చే అంశం. అయితే శాంసన్, క్లాసెన్ వంటి దిగ్గజాలు కూడా రేసులో ఉండటంతో గిల్ జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది.

టాప్-5 రేసులో యువ కెరటాలు

ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న మొదటి ఐదుగురు ఆటగాళ్ల జాబితాను చూస్తే అందరూ నిలకడగా రాణిస్తున్నవారే కనిపిస్తున్నారు. అభిషేక్ శర్మ 323 పరుగులతో టాప్‌లో ఉండగా, హెన్రిచ్ క్లాసెన్ 320 పరుగులతో గట్టి పోటీ ఇస్తున్నాడు. సంజూ శాంసన్ నిన్నటి సెంచరీతో 293 పరుగులకు చేరుకుని మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 254 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. వీరిని అధిగమించడం కోహ్లీకి అంత సులభం కాకపోవచ్చు.

నేటి మ్యాచ్ కీలకం

ఐపీఎల్ 2026 లీగ్ దశ సగానికి చేరుకోవడంతో ప్రతి పరుగు ఎంతో కీలకం. ఆర్‌సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ద్వారా పాయింట్ల పట్టికలో మార్పులు రావడమే కాకుండా, బ్యాటర్ల వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో కూడా భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. కోహ్లీ హోమ్ గ్రౌండ్‌లో చెలరేగుతాడా లేక గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆరెంజ్ క్యాప్ దక్కించుకుంటాడా అనేది కొద్ది గంటల్లోనే తేలిపోనుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us