
NZ vs AFG : టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభమై రెండో రోజే మైదానంలో ఒక ప్రమాదకర దృశ్యం కనిపించింది. చెన్నైలోని ఎం.ఏ చిదంబరం స్టేడియంలో ఆదివారం (ఫిబ్రవరి 8) జరిగిన న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో కివీస్ ఆటగాళ్లిద్దరు బంతి కోసం పరిగెత్తుతూ ఒకరినొకరు బలంగా ఢీకొన్నారు. ఈ ఘటనతో మైదానంలో ఉన్న ఆటగాళ్లు, ప్రేక్షకులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం జరిగిన న్యూజిలాండ్ – ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ 3వ ఓవర్లో ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ బౌలింగ్కు వచ్చాడు. ఆఫ్ఘన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఒక బంతిని గాలిలోకి కొట్టాడు. ఆ క్యాచ్ పట్టేందుకు వికెట్ కీపర్ టిమ్ సైఫర్ట్, ఫీల్డర్ ఫిన్ అలెన్ ఇద్దరూ బంతి వైపు కళ్ళు పెట్టి పరుగెత్తారు. ఒకరినొకరు చూసుకోకుండా వేగంగా వచ్చి బలంగా ఢీకొన్నారు. దాంతో ఇద్దరూ ఒక్కసారిగా మైదానంలో పడిపోయారు.
ఆటగాళ్లిద్దరూ ఢీకొన్న వేగంలో ఆ క్యాచ్ చేజారింది. ఆ సమయంలో గుర్బాజ్ కేవలం 7 పరుగుల మీద ఉన్నాడు. కివీస్ ఫీల్డర్లు ఒకరికొకరు కాల్ ఇచ్చుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బంతి కిందపడిపోవడంతో గుర్బాజ్కు ప్రాణదానం లభించినట్లయ్యింది. అయితే, కివీస్ అభిమానులు ఊపిరి పీల్చుకునే విషయం ఏంటంటే.. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆటగాళ్లకు పెద్దగా గాయాలేమీ కాలేదు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ లేచి నిలబడటంతో అంతా శాంతించారు.
మ్యాచ్ పరిస్థితి ఏంటి?
ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించింది. గుర్బాజ్ ఆ అదృష్టాన్ని వాడుకుని 27 పరుగులు చేయగా, మరోవైపు గుల్బాదిన్ నైబ్ 35 బంతుల్లోనే 63 పరుగులు చేసి న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ 182/6 స్కోరు సాధించి కివీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. న్యూజిలాండ్ తరఫున లూకీ ఫెర్గూసన్ అద్భుతమైన బౌలింగ్తో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఆరో ఓవర్లో గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ ఇద్దరినీ ఒకే ఓవర్లో ఔట్ చేసి కివీస్ను రేసులోకి తెచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..