
Who is Madhav Tiwari : ఐపీఎల్ ఎందరో సామాన్యులను సెలబ్రిటీలుగా మార్చింది. తాజాగా ఆ జాబితాలో మధ్యప్రదేశ్కు చెందిన యువ కెరటం మాధవ్ తివారీ చేరిపోయాడు. మే 11న పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను గెలిపించి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. అదిరిపోయే బౌలింగ్, అంతకు మించిన బ్యాటింగ్తో ఆల్రౌండర్గా తానేంటో నిరూపించుకున్నాడు. అసలు ఈ కుర్రాడిని వెలికితీసింది ఎవరు? ఇంతటి అద్బుతమైన ఆట వెనుక ఉన్న గురువు ఎవరు? అనే చర్చ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో మొదలైంది.
ఐపీఎల్ 2026లో తన మొదటి మ్యాచ్లోనే మాధవ్ తివారీ విశ్వరూపం చూపించాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన హోరాహోరీ పోరులో 4 ఓవర్లు వేసి 40 పరుగులిచ్చి ప్రియాన్ష్ ఆర్య, కౌపర్ కానోలీ వంటి కీలక వికెట్లను పడగొట్టాడు. ఇక బ్యాటింగ్లోనూ 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. కేవలం 8 బంతుల్లోనే 18 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తన ఆల్రౌండ్ ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో ఇది అతనికి రెండో మ్యాచ్ మాత్రమే కావడం విశేషం.
మధ్యప్రదేశ్లోని ఒక చిన్న పట్టణం మౌగంజ్ నుంచి వచ్చిన మాధవ్ను ఒక కంప్లీట్ ఆల్రౌండర్గా మార్చింది టీమిండియా మాజీ క్రికెటర్ అమయ్ ఖురేషియా. మొదట్లో మాధవ్కు కేవలం బ్యాటింగ్ అంటేనే ప్రాణం. బౌలింగ్ అంటే అలసట అని పారిపోయేవాడట. కానీ ఇండోర్లో శిక్షణ ఇచ్చే క్రమంలో అమయ్ ఖురేషియా అతనిలోని బౌలింగ్ నైపుణ్యాన్ని గుర్తించారు. నువ్వు కేవలం బ్యాటర్ మాత్రమే కాదు, గొప్ప ఆల్రౌండర్ కాగలవని ప్రోత్సహించి అతనికి బౌలింగ్లో శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణే ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు వరంగా మారింది. అమయ్ ఖురేషియా భారత్ తరపున 12 వన్డేలు ఆడిన అనుభవం ఉన్న ఆటగాడు.
ప్రస్తుతం టీమిండియాలో హార్దిక్ పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయం కోసం వెతుకులాట జరుగుతోంది. నితీష్ రెడ్డి, శివమ్ దూబే వంటి వారు రేసులో ఉన్నప్పటికీ, మాధవ్ తివారీలో ఉన్న కాన్ఫిడెన్స్ సెలక్టర్లను ఆలోచింపజేస్తోంది. నేను వంద శాతం బ్యాటర్ని, వంద శాతం బౌలర్ని అని అతను గంభీరంగా చెబుతున్న తీరు అందరినీ ఆకర్షిస్తోంది. అతని బాడీ లాంగ్వేజ్, ప్రెషర్ సమయంలో ఆడే తీరు చూస్తుంటే భవిష్యత్తులో హార్దిక్ పాండ్యా స్థానానికి బలమైన పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..