
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు గత సీజన్ల రికార్డులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా కెప్టెన్సీ ప్రభావం ఎంత కీలకమో చెప్పే ఉదాహరణగా ఈ ఇద్దరు ఆటగాళ్ల పేర్లు నిలుస్తున్నాయి.
ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వార్న్ 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరించాడు. అతని నాయకత్వంలో జట్టు అంచనాలను మించి ప్రదర్శన చేసి ఫైనల్కు చేరింది.
నవీ ముంబైలో జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ను 3 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఆ విజయంతో వార్న్ కెప్టెన్సీకి ప్రత్యేక గుర్తింపు లభించింది.
షేన్ వార్న్ తర్వాత ఇదే రికార్డును సాధించిన ఆటగాడు రజత్ పటిదార్. టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడకుండానే IPLలో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి, రాయల్ చాలెంజర్స్ బెంగళూరును 2025లో ఛాంపియన్గా నిలిపాడు.
పంజాబ్ కింగ్స్పై ఫైనల్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించి, 17 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించాడు.
ఈ ఇద్దరు ఆటగాళ్లు టీ20ఐ ఆడకపోయినా, టెస్ట్, వన్డేల్లో తమ దేశానికి సేవలందించారు. షేన్ వార్న్ 145 టెస్టులు, 194 వన్డేలు ఆడి 1000కి పైగా వికెట్లు తీశాడు. రజత్ పటిదార్ భారత జట్టుకు టెస్ట్, వన్డేల్లో ప్రాతినిధ్యం వహించి తన ప్రతిభను నిరూపిస్తున్నాడు.
ఈ ఇద్దరి కథ ఒక విషయం స్పష్టంగా చెబుతోంది.. అంతర్జాతీయ అనుభవం లేకపోయినా సరైన నాయకత్వం ఉంటే జట్టును విజయపథంలో నడిపించవచ్చు. వ్యూహం, ధైర్యం, ఆటగాళ్లను నడిపించే శైలి కీలకం.
షేన్ వార్న్, రజత్ పటిదార్ చేసిన ఈ అరుదైన ఘనత ఐపీఎల్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఐపీఎల్ 2026లో కూడా ఇలాంటి కొత్త కథలు పుడతాయా అన్నది ఆసక్తిగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..