PSLను ఛీకొట్టాడు.. కట్‌చేస్తే.. రూ. 2 కోట్లతో హారతి పట్టేసిన ఐపీఎల్.. అసలెవరీ ఆల్ రౌండర్..!

ఐపీఎల్ 2026 సీజన్ ముంగిట పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక టీ20 కెప్టెన్ దాసున్ శనక పీఎస్ఎల్ కాంట్రాక్టును రద్దు చేసుకుని మరీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చేరాడు. గాయంతో దూరమైన ఇంగ్లాండ్ స్టార్ సామ్ కరణ్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఈ లంక ప్లేయర్ ను జట్టులోకి తీసుకుంది. ఈ నిర్ణయంతో శనకకు భారీగా ఆర్థిక లాభం చేకూరడం గమనార్హం.

PSLను ఛీకొట్టాడు.. కట్‌చేస్తే.. రూ. 2 కోట్లతో హారతి పట్టేసిన ఐపీఎల్.. అసలెవరీ ఆల్ రౌండర్..!
Dasun Shanaka Rajasthan Royals

Updated on: Mar 24, 2026 | 8:44 AM

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సీజన్ ఆరంభానికి ముందే పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆల్ రౌండర్ సామ్ కరణ్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు రాజస్థాన్ యాజమాన్యం శ్రీలంక వెటరన్ ఆటగాడు దాసున్ శనకను ఎంచుకుంది. వేలంలో అమ్ముడుపోని శనకను రూ. 2 కోట్ల ప్రాథమిక ధరతో రాయల్స్ ఒప్పందం చేసుకుంది. శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర పర్యవేక్షణలో శనక ఫినిషర్‌గా జట్టుకు సమతుల్యతను తీసుకురానున్నారు.

పీఎస్ఎల్ వదిలగానే భారీ లాభం..

దాసున్ శనక ఈ ఏడాది పీఎస్ఎల్ వేలంలో లాహోర్ ఖలందర్స్ జట్టుకు రూ. 75 లక్షల పాకిస్థానీ రూపాయలకు (భారత కరెన్సీలో సుమారు రూ. 25 లక్షలు) అమ్ముడుపోయాడు. అయితే, ఐపీఎల్ నుంచి పిలుపు రావడంతో ఆయన పీఎస్ఎల్ ఒప్పందాన్ని కాదనుకున్నాడు. ఐపీఎల్ లో ఆయనకు రూ. 2 కోట్లు లభించనున్నాయి. అంటే పీఎస్ఎల్ లో లభించే మొత్తం కంటే సుమారు రూ. 1.75 కోట్లు అదనంగా ఆయనకు దక్కనున్నాయి. ఈ భారీ వ్యత్యాసమే ఆయన నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

మూడోసారి కూడా అదృష్టమే..!

దాసున్ శనక ఐపీఎల్ లోకి రావడం ఇది మూడోసారి కాగా, విశేషమేమిటంటే మూడు సార్లు కూడా ఆయన గాయపడిన ఆటగాళ్ల స్థానంలోనే ఎంట్రీ ఇచ్చాడు. గతంలో గుజరాత్ టైటాన్స్ తరపున కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో ఆయన జట్టులో చేరాడు. అయితే గత సీజన్లలో ఆయనకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. ఈసారి రాజస్థాన్ రాయల్స్ తరపున మెరుగైన ప్రదర్శన చేయాలని ఆయన పట్టుదలతో ఉన్నాడు.

పీసీబీకి పెరుగుతున్న ఇబ్బందులు..

ఇప్పటికే జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ పీఎస్ఎల్ వదిలి కోల్‌కతా నైట్ రైడర్స్ లో చేరగా, ఇప్పుడు శనక కూడా అదే బాట పట్టారు. ఐపీఎల్ లో లభించే భారీ పారితోషికం, అంతర్జాతీయ గుర్తింపు కారణంగా ఆటగాళ్లు పీఎస్ఎల్ కు స్వస్తి పలుకుతున్నారు. ఇది పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు (PCB) తలనొప్పిగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us