
ముంబైలోని సొంత గడ్డ వాంఖడే స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 103 పరుగుల భారీ తేడాతో ముంబై ఇండియన్స్ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో ముంబై బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. కేవలం 19 ఓవర్లలోనే 104 పరుగులకు ఆలౌట్ కావడంతో ముంబై చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద ఓటమిని మూటగట్టుకుంది.
ప్రస్తుత సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడగా, కేవలం 2 విజయాలు మాత్రమే నమోదు చేసింది. మిగిలిన 5 మ్యాచ్ల్లో ఓటమి పాలవ్వడంతో 4 పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ముంబై నెట్ రన్ రేట్ -0.736 గా ఉంది. ఇది ప్లేఆఫ్స్ రేసులో జట్టుకు పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది.
ముంబై జట్టు వైఫల్యాలకు ప్రధాన కారణం రోహిత్ శర్మ గైర్హాజరీ అని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా విశ్లేషించారు. సీజన్ ప్రారంభంలో కోల్కతాతో జరిగిన మ్యాచ్లో 78 పరుగులు చేసిన రోహిత్, నాలుగో మ్యాచ్లో గాయపడటంతో మైదానానికి దూరమయ్యాడు. రోహిత్ లేకపోవడంతో ఓపెనింగ్లో శుభారంభం లభించడం లేదని, అలాగే క్లిష్ట సమయాల్లో హార్దిక్ పాండ్యాకు రోహిత్ అనుభవజ్ఞుడైన సలహాలు అందకపోవడం జట్టును దెబ్బతీస్తోందని ఆయన అభిప్రాయపడ్డాడు.
సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి హేమాహేమీలు ఆశించిన స్థాయిలో పరుగులు చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత మ్యాచ్లో తిలక్ వర్మ సెంచరీతో ఆదుకున్నప్పటికీ, మిగిలిన ఆటగాళ్ల నుంచి మద్దతు లభించడం లేదు. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, అల్లా గజన్ఫర్ రాణిస్తున్నా, ఇతర బౌలర్లు భారీగా పరుగులు ఇస్తుండటం జట్టును ఆత్మరక్షణలో పడేస్తోంది.
కోల్కతాతో విజయంతో ప్రయాణాన్ని మొదలుపెట్టిన ముంబై, ఆ తర్వాత వరుసగా నాలుగు ఓటములను చవిచూసింది. గుజరాత్పై గెలిచి మళ్లీ పుంజుకుంటుంది అనుకున్న తరుణంలో చెన్నై చేతిలో ఎదురైన ఈ పరాభవం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. రోహిత్ శర్మ త్వరగా జట్టులోకి రాకపోతే, ఈ సీజన్లో ముంబై ముందడుగు వేయడం అసాధ్యంగా కనిపిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..