
IPL 2026 :క్రికెట్ ఫ్యాన్స్కు పండుగ లాంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ కోసం రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెలలో ఐపీఎల్ 2026 కోసం మినీ ఆక్షన్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ఇప్పటికే 10 జట్లు తాము రిటైన్ చేసుకున్న, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాలను విడుదల చేశాయి. అయితే ఈసారి ఐపీఎల్ వేలాన్ని విదేశాల్లో నిర్వహించనున్నారు. ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ తేదీ, వేదిక, మిగతా ముఖ్యమైన వివరాలు తెలుసుకుందాం.
ఐపీఎల్ 19వ సీజన్కు రంగం సిద్ధమైంది. రాబోయే ఐపీఎల్ 2026 కోసం మినీ వేలం వచ్చే నెల జరగనుంది. దీనికి సంబంధించిన తేదీ, వేదిక వివరాలను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఈసారి వేలాన్ని విదేశాల్లోని అబుదాబిలోని ఎతిహాద్ అరేనాలో డిసెంబర్ 16న నిర్వహించనున్నారు. ఈ మినీ వేలానికి ముందు 10 జట్లు కలిసి మొత్తం 173 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. వీరిలో 49 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడానికి ఇంకా 77 స్లాట్లు మిగిలి ఉన్నాయి. అన్ని జట్ల పర్సులలో కలిపి మొత్తం రూ.237.55 కోట్ల డబ్బు వేలంలో అందుబాటులో ఉంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఒక జట్టులో గరిష్టంగా 25 మంది ఆటగాళ్లు ఉండవచ్చు. పంజాబ్ కింగ్స్ 21 మందిని, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ చెరో 20 మందిని ఇప్పటికే రిటైన్ చేసుకున్నారు.
ఫ్రాంచైజీల వద్ద మిగిలిన డబ్బు గురించి చూస్తే, కోల్కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా రూ.64.3 కోట్లు ఉన్నాయి. వీరు ఏకంగా 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. ఆండ్రే రసెల్, వెంకటేశ్ అయ్యర్ వంటి ఖరీదైన ఆటగాళ్లను కేకేఆర్ విడుదల చేయడం దీనికి కారణం. మరోవైపు, సన్రైజర్స్ హైదరాబాద్ పర్స్లో రూ.25.5 కోట్లు మిగిలాయి.
అయితే ముంబై ఇండియన్స్ మాత్రం అతి తక్కువ మొత్తంతో వేలానికి వెళ్తోంది. ఆ జట్టు వద్ద కేవలం రూ.2.75 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ముంబై ఇండియన్స్ తమ ముఖ్య ఆటగాళ్లందరినీ అట్టిపెట్టుకోవడం వలన వారి పర్స్లో డబ్బు తక్కువగా ఉంది. ఈ వేలం ద్వారా కేకేఆర్ తమ జట్టును దాదాపు కొత్తగా నిర్మించుకోవడానికి మంచి అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..