‘ఈసాలా కప్ నమదే’ ఆర్సీబీ ఫ్యాన్స్కు ఇది కలగానే మిగిలిపోయింది. 16 సీజన్లు.. ఇంకా ట్రోఫీ కోసం నిరీక్షణ. కోహ్లీకి మళ్లీ మళ్లీ నిరాశే. ఐపీఎల్ 2023లో ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఘోర ఓటమిపాలైంది. నాకౌట్ స్టేజికి వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ఇది.. ఇందులో ఆర్సీబీ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. గుజరాత్ బ్యాటర్ శుభ్మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో బెంగళూరు ఆశలపై నీళ్లు చల్లాడు. గిల్ 52 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 104 పరుగులు చేసి ఆజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్లోనూ ఆర్సీబీ మరోసారి ఫ్యాన్స్కు నిరాశ మిగల్చగా.. ఆ జట్టు ఓటమికి ప్రధానంగా నిలిచిన 4 కారణాలివే..
బెంగళూరు బ్యాటింగ్ విభాగం పేపర్ మీద మాత్రమే మరోసారి స్ట్రాంగ్ అని నిరూపించుకుంది. ఓపెనర్లుగా బరిలోకి దిగే విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ప్రతీ మ్యాచ్లో అద్భుతంగా రాణిస్తుంటే.. మిడిలార్డర్ బ్యాట్స్మెన్ పలు మ్యాచ్ల్లో అదిరిపోయే ఇన్నింగ్స్లు చేసినా.. కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేస్తున్నాడు. ఇక మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ కూడా అంచనాలకు తగ్గట్టు రాణించట్లేదు. దీన్ని బట్టి చూస్తే టాప్ 3 బ్యాటర్లు తప్ప.. మిగిలినవారు ఎవ్వరూ ఆర్సీబీ బ్యాటింగ్లో తమవంతు పాత్ర పోషించట్లేదు.
టాప్ వికెట్ గెట్టర్లో బెంగళూరు బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఉన్న సంగతి తెలిసిందే. మొత్తం 14 మ్యాచ్లు ఆడిన అతడు.. ఏకంగా 19 వికెట్లు తీశాడు. ఆర్సీబీ కీ బౌలర్ హసరంగా, హజిల్వుడ్, హర్షల్ పటేల్, పార్నెల్ పూర్తిగా విఫలమయ్యారు. వరుస మ్యాచ్ల్లో వికెట్లు తీయడంలో కష్టపడటమే కాదు.. ధారాళంగా పరుగులు సమర్పించారు.
కే(కోహ్లీ)జీ(గ్లెన్ మ్యాక్స్వెల్)ఎఫ్(ఫాఫ్ డుప్లెసిస్).. ఈ ఆర్సీబీ ప్లేయర్స్లో మ్యాక్సీ, డుప్లెసిస్ విఫలమైతే చాలు.. జట్టును లోన్ వారియర్గా కాపాడుకుంటూ వచ్చాడు విరాట్ కోహ్లీ. కోహ్లీకి మరో ఎండ్ నుంచి ఇంకో బ్యాటర్ ఎలాంటి సహకారం అందివ్వలేదు.
గత సీజన్లో ఫినిషర్ పాత్ర పోషించిన దినేష్ కార్తీక్.. ఈ ఏడాది పూర్తిగా విఫలమయ్యాడు. డకౌట్లుగా వెనుదిరిగాడు. కోహ్లీ, డుప్లెసిస్ మంచి ఆరంభం అందించినా.. ఫినిషర్ పాత్ర లేకపోవడంతో ఆ స్కోర్.. అద్దిరిపోయే ఫిగర్ అందుకోలేకపోయింది.