Team India: IPL తర్వాత టీమిండియా ఫుల్‌బిజీ.. షెడ్యూల్‌లో చేరిన 5 మ్యాచ్‌లు.. ఎప్పుడు, ఎక్కడంటే?

|

Mar 26, 2023 | 8:10 AM

భారత జట్టు ఆటగాళ్లు రాబోయే రెండు నెలల పాటు IPL 2023లో బిజీగా ఉండునున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత కూడా ఆటగాళ్లకు విశ్రాంతి లభించకపోవడం గమనార్హం. వివిధ ఫార్మాట్లలో నిరంతరం అనేక మ్యాచ్‌లు ఆడవలసి ఉంది.

Team India: IPL తర్వాత టీమిండియా ఫుల్‌బిజీ.. షెడ్యూల్‌లో చేరిన 5 మ్యాచ్‌లు.. ఎప్పుడు, ఎక్కడంటే?
Team India
Follow us on

మరో రెండు నెలల పాటు టీమిండియా అంతర్జాతీయ సీజన్‌కు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే, రెండు నెలల తర్వాత టీమిండియా షెడ్యూల్ ఫుల్ బిజీగా మారిపోయింది. ఆస్ట్రేలియాతో టెస్ట్, వన్డే సిరీస్‌ల తర్వాత భారత ఆటగాళ్లు ప్రస్తుతం IPL 2023 కోసం సిద్ధమవుతున్నారు. టీ20 లీగ్ 16వ సీజన్ అహ్మదాబాద్‌లో మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. ఇది మే 28 వరకు కొనసాగుతుంది. ఈ రెండు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ తిరిగి రానుంది. ఈ షెడ్యూల్‌లో మరికొన్ని మ్యాచ్‌లు వచ్చి చేరడంతో టీమిండియా చాలా బిజీగా మారిపోయింది.

ఐపీఎల్ 2023 తర్వాత, భారత జట్టు మొత్తం దృష్టి ఆస్ట్రేలియాతో తలపడే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌పైనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. WTC చివరి మ్యాచ్ జూన్ 7 నుంచి 11 వరకు లండన్‌లోని ఓవల్ మైదానంలో జరగనుంది. ఈ ఫైనల్ ముగిసిన వెంటనే ఎలాంటి విశ్రాంతి లేకుండా టీమిండియా ఇతర మ్యాచ్‌ల్లో బిజీబిజీగా ఉండనుంది.

WTC ఫైనల్ తర్వాత వన్డే సిరీస్..

క్రిక్‌బజ్‌ నివేదిక ప్రకారం, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ ఫైనల్ ముగిసిన వెంటనే జూన్ నెలలోనే ODI సిరీస్‌ని నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అక్టోబరు-నవంబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ సన్నాహాలను దృష్టిలో ఉంచుకుని భారత బోర్డు ఈ సిరీస్‌ను నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకోసం శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ వంటి బోర్డులతో చర్చలు జరుపుతున్నప్పటికీ ఇంతవరకు తుది నిర్ణయం తీసుకోలేదు. ఇది మూడు మ్యాచ్‌ల సిరీస్ కావచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

వెస్టిండీస్‌లో రెండు అదనపు మ్యాచ్‌లు..

ఈ వన్డే సిరీస్ తర్వాత, జులై-ఆగస్టులో జరిగే వెస్టిండీస్ పర్యటనలో భారత్ కొన్ని అదనపు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి బీసీసీఐ, క్రికెట్ వెస్టిండీస్ మధ్య ఒప్పందం కుదిరింది. కానీ, అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఈ టూర్‌లో టీమిండియా అదనంగా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడుతుందని నివేదికలో పేర్కొంది. ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, భారత్ రెండు టెస్టు మ్యాచ్‌లతో పర్యటనను ప్రారంభించాల్సి ఉంది. ఆ తర్వాత 3 వన్డేలు ఆడనున్నాయి. అప్పుడు 3 టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా, ఇప్పుడు మరో 2 మ్యాచ్‌లు వచ్చి చేరాయి. అంటే కరేబియన్ టూర్‌లో టీమిండియా మొత్తం 10 మ్యాచ్‌లు ఆడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..