
Ind vs Eng T20I Series: టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఐర్లాండ్ పర్యటనలో చతికిలపడిన భారత జట్టు, తాజాగా ఇంగ్లాండ్ టీ20 సిరీస్లోనూ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో వరుసగా ఆరు మ్యాచ్ల్లో ఓడిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ పేలవ ప్రదర్శనతో ముగ్గురు కీలక ఆటగాళ్ల అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగింపునకు వచ్చినట్లు తెలుస్తోంది.
భారత క్రికెట్లో అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న సంజూ శాంసన్, మరోసారి తనకు వచ్చిన సువర్ణ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఐర్లాండ్ పర్యటనలోనే కాకుండా, ఇంగ్లాండ్ సిరీస్లోనూ బ్యాటింగ్లో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో సిరీస్ మధ్యలోనే అతడిని తుది జట్టు నుంచి తప్పించాల్సి వచ్చింది.
ఇంగ్లాండ్ వేదికగా జరిగిన రెండు టీ20 ఇన్నింగ్స్ల్లో సంజూ కేవలం 1, 27 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంతకుముందు ఐర్లాండ్ పర్యటనలో సైతం కేవలం 5 పరుగులకే పరిమితమయ్యాడు. సంజూ శాంసన్ వరుస వైఫల్యాలపై అటు మేనేజ్మెంట్, ఇటు అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సెలక్టర్లు ఇకపై అతడిని పక్కన పెట్టి, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ వంటి యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం.
భారత వేగవంతమైన బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణకు ఈ పర్యటనలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. 30 ఏళ్ల ఈ పేసర్ తన బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐర్లాండ్ సిరీస్లో ఒకే మ్యాచ్లో ఏకంగా 57 పరుగులు సమర్పించుకుని తీవ్ర విమర్శలపాలయ్యాడు. ఆ మ్యాచ్లో అతడి ఎకానమీ రేటు 14.25గా నమోదైంది.
ఇక ఇంగ్లాండ్ సిరీస్లోనూ ప్రసిద్ధ్ కృష్ణ లయ అందుకోలేకపోయాడు. ఆడిన రెండు మ్యాచ్ల్లో 9.14 ఎకానమీతో బౌలింగ్ చేసి కేవలం ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. పరుగులు భారీగా సమర్పిస్తూ వికెట్లు తీయడంలో వెనుకబడటంతో, భవిష్యత్తులో అతనికి టీమిండియా జెర్సీ దక్కడం దాదాపు అసాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి.
భారత జట్టులో ఒకప్పుడు నమ్మకమైన ఆల్రౌండర్గా గుర్తింపు తెచ్చుకున్న వాషింగ్టన్ సుందర్ ప్రదర్శన ఇప్పడు ప్రశ్నార్థకంగా మారింది. 3 ఫార్మాట్లలోనూ భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఈ యువ ఆటగాడు, గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో వచ్చిన అవకాశాలను సుందర్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
ఇది కూడా చదవండి: ‘నా పేరిట చెత్త రికార్డ్.. ప్రపంచంలో కెప్టెన్ జీరో నేనే’..: శ్రేయస్ అయ్యర్
గడిచిన ఐదు అంతర్జాతీయ మ్యాచ్ల గణాంకాలను పరిశీలిస్తే, వాషింగ్టన్ సుందర్ బ్యాట్తో కేవలం 23 పరుగులు మాత్రమే చేసి, బౌలింగ్లో ఒకే ఒక్క వికెట్ సాధించాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండింటిలోనూ విఫలం కావడంతో జట్టులో అతడి స్థానంపై సెలక్టర్లు పునరాలోచనలో పడ్డారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..