
India T20 World Cup 2026 Super 8 Schedule: మూడు వరుస విజయాలతో గ్రూప్ దశలో అద్భుతంగా ఆకట్టుకున్న భారత్.. మరో మ్యాచ్ ఉండగానే సూపర్ 8కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో టీమిండియా టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 షెడ్యూల్ను ఖరారు చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ఆదివారం పాకిస్తాన్పై 61 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా, గ్రూప్-A నుంచి సూపర్-8కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే.
కొలంబోలో మేఘావృత వాతావరణం, తడి పిచ్పై భారత బ్యాటర్లను పరీక్షించాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అభిషేక్ శర్మను సల్మాన్ తొందరగా ఔట్ చేసినప్పటికీ, ఇషాన్ కిషన్ మెరుపులు, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివం దూబే చేసిన కీలక భాగస్వామ్యాలు భారత్ జట్టును 175 పరుగుల స్కోరుకు చేర్చాయి. ప్రత్యుత్తరంగా పాకిస్తాన్ వరుసగా వికెట్లు కోల్పోయి 114 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్కు ఏకపక్ష విజయం దక్కింది.
పాకిస్తాన్పై గెలుపుతో భారత్ తన అజేయ పరంపరను కొనసాగించడమే కాకుండా, సూపర్-8 దశకు అర్హత సాధించింది. గ్రూప్-A నుంచి సూపర్-8కు అర్హత సాధించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. నెట్ రన్రేట్ భారీగా తగ్గిపోవడంతో పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది.
ఇప్పుడు సల్మాన్ అలీ ఆఘా సేన తమ చివరి గ్రూప్ మ్యాచ్లో నమీబియాపై తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. లేదంటే గ్రూప్ దశలోనే అవమానకర నిష్క్రమణ ఎదురవుతుంది. ఇక సూపర్-8కు అర్హత ఖరారు చేసుకున్న టీమిండియా షెడ్యూల్ ఓసారి చూద్దాం..
IND vs SA – ఫిబ్రవరి 22, అహ్మదాబాద్ (నరేంద్ర మోదీ స్టేడియం) – రాత్రి 7:00 గంటలకు (IST)
IND vs ZIM/AUS – ఫిబ్రవరి 26, చెన్నై (ఎం.ఏ. చిదంబరం స్టేడియం) – రాత్రి 7:00 గంటలకు (IST)
IND vs WI – మార్చి 1, కోల్కతా (ఈడెన్ గార్డెన్స్) – రాత్రి 7:00 గంటలకు (IST)
భారత్ సూపర్-8 షెడ్యూల్లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్తో పాటు ఆస్ట్రేలియా లేదా జింబాబ్వే (గ్రూప్-B నుంచి అర్హత సాధించే జట్టు)తో హై-వోల్టేజ్ మ్యాచ్లు ఉన్నాయి.
నెదర్లాండ్స్తో చివరి గ్రూప్ మ్యాచ్ ఆడిన తర్వాత, ఫిబ్రవరి 22న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో భారత్ సూపర్-8 తొలి మ్యాచ్ ఆడుతుంది.
తదుపరి మ్యాచ్ ఫిబ్రవరి 26న చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. గ్రూప్ దశలో ముంబై, ఢిల్లీ, కొలంబో, అహ్మదాబాద్ల్లో ఆడిన తర్వాత చెన్నైలో టీమ్ ఇండియా ఆడే తొలి మ్యాచ్ ఇదే.
మార్చి 1న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో భారత్ చివరి సూపర్-8 మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ హై-టెన్షన్ పోరుగా మారే అవకాశాలు ఉన్నాయి.
సూపర్-8 దశలో భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా/జింబాబ్వే ఒక గ్రూప్గా ఉంటాయి. మరో గ్రూప్లో పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లాండ్ (అర్హత సాధిస్తే) ఉంటారు.
ప్రస్తుతం సూపర్-8కు అర్హత సాధించిన జట్లు భారత్, వెస్టిండీస్ మాత్రమే. పాకిస్తాన్, ఇంగ్లాండ్ తమ చివరి మ్యాచ్ల్లో గెలిస్తేనే తదుపరి దశకు చేరతాయి. గ్రూప్-D నుంచి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఫేవరెట్లుగా కొనసాగుతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..