AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ZIM: ‘ఇట్టైతే టీమిండియా గెలవడం కష్టమే.. ఆ ఇద్దరు వేస్ట్, అర్జంటుగా పీకేయండి’

Team India Playing XI: దక్షిణాఫ్రికాతో ఓటమి తర్వాత జింబాబ్వేతో టీమిండియా మ్యాచ్ కీలకంగా మారింది. సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాలి. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తుండగా, తిలక్ వర్మ స్థానంలో సంజూ శాంసన్ వచ్చే అవకాశం ఉంది. నెట్ రన్ రేట్‌ను మెరుగుపరచుకోవడం కూడా అత్యవసరం.

IND vs ZIM: 'ఇట్టైతే టీమిండియా గెలవడం కష్టమే.. ఆ ఇద్దరు వేస్ట్, అర్జంటుగా పీకేయండి'
Ind Vs Zim Playing Xi
Venkata Chari
|

Updated on: Feb 24, 2026 | 7:44 AM

Share

Team India Playing XI: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్–8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓటమి తర్వాత, భారత్ ప్లేయింగ్ XI ఎంపికపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇవ్వడం వివాదాస్పదమైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ సుందర్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. జింబాబ్వేతో జరగనున్న తదుపరి మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక సూచన చేశాడు. అక్షర్ పటేల్‌ను తిరిగి ప్లేయింగ్ XIలోకి తీసుకురావాలని, అవసరమైతే ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో అతడికి అవకాశం ఇవ్వాలని సూచించాడు.

“జింబాబ్వే బ్యాటింగ్ లైనప్‌లో ఎడమచేతి బ్యాటర్లు తక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్‌ను ప్లేయింగ్ XIలోకి తీసుకురావాలి. అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో అతడిని తీసుకోవచ్చు,” అని గవాస్కర్ జియోస్టార్‌లో వ్యాఖ్యానించాడు.

అయితే, “దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో అర్ష్‌దీప్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. మంచి రిథమ్‌లో ఉన్న ఆటగాడిని మార్చడం కష్టం. కాబట్టి జట్టు మేనేజ్‌మెంట్ మార్పులు చేయకుండా అదే జట్టుతో కొనసాగవచ్చు,” అని కూడా గవాస్కర్ అన్నాడు.

ఇదిలా ఉంటే, భారత్ అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్, బ్యాటింగ్ కోచ్ సీతాంశు కోటక్ ఈ నిర్ణయం పూర్తిగా వ్యూహాత్మక కారణాల వల్లే తీసుకున్నామని స్పష్టం చేశారు. “గత కొన్ని రోజులుగా ప్లేయింగ్ XI ఎంపికపై చాలా చర్చ జరిగింది. మిడిల్ ఓవర్లలో మ్యాచప్‌లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. వెనక్కి చూస్తే అక్షర్‌ను ఆడించాల్సిందన్న భావన రావచ్చు. కానీ ఆ సమయంలో ఎనిమిదో బ్యాటర్‌గా రింకూను తీసుకోవాల్సిన అవసరం ఉందని అనిపించింది,” అని టెన్ డోషేట్ మీడియాతో అన్నారు.

అక్షర్ జట్టుకు ఎంత ముఖ్యమో ఈ నిర్ణయం ప్రతిబింబించదని కూడా ఆయన స్పష్టం చేశారు. “అక్షర్ నాయకత్వం, అతడి ప్రాముఖ్యతపై ఎలాంటి సందేహం లేదు. ఈ నిర్ణయం అతడిని తక్కువగా చూసి తీసుకున్నది కాదు,” అని టెన్ డోషేట్ వివరించారు.

ఓపెనింగ్ జోడిలో మార్పు అలాగే మూడో స్థానంలో బ్యాటింగ్ వస్తున్న తిలక్ వర్మ జింబాబ్వేతో మ్యాచ్ నుంచి తప్పించే అవకాశం ఉంది. తిలక్ వర్మ ఈ ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు తనదైన ముద్ర వేయలేకపోయాడు. గత మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి బాధ్యరహితమైన షాట్‌తో పెవిలియన్ చేరాడు. దీంతో కోచ్ గౌతం గంభీర్ కూడా తిలక్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో అతడి స్థానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి రానున్నాడు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్‌గా వస్తే, మూడో స్థానంలో ఇషాన్ కిషన్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్లయిన ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలపై ప్రత్యర్థి జట్లు రైట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్‌తో దాడి చేస్తున్న నేపథ్యంలో లెఫ్ట్-రైట్ కాంబినేషన్‌తో బరిలోకి దిగాలని టీం మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై లాంటిదే. కేవలం గెలవడమే కాకుండా రన్ రేటు మెరుగుపరుచుకోవడం కూడా ముఖ్యం. అర్శదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాలతో కూడిన బౌలింగ్ విభాగం ఫామ్‌లో ఉండటం భారత్‌కు సానుకూల అంశం. మొత్తంగా, టీమిండియా ప్లేయింగ్ XI ఇలా ఉండే అవకాశం ఉంది: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us