
Tendulkar – Anderson Trophy: ఇంగ్లాండ్లో భారత పర్యటించనుంది. ఇందులో భాగంగా 5 టెస్ట్ల సిరీస్ ఆడనుంది. అయితే, త్వరలోనే ఈ పర్యటనకు కొత్త పేరు పెట్టవచ్చు అని తెలుస్తోంది. టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా మార్చనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) ఇంగ్లాండ్ గడ్డపై రెండు దేశాల మధ్య భవిష్యత్ సిరీస్లకు టెస్ట్ క్రికెట్లో అత్యధికంగా ఆడిన ఇద్దరు ఆటగాళ్లు – సచిన్ టెండూల్కర్ (200), జేమ్స్ ఆండర్సన్ (188) పేరు పెట్టాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
“ట్రోఫీకి చాలా మంది క్యాప్డ్ ఆటగాళ్ల పేరు పెట్టే అధికారం ఇంగ్లండ్కు ఉంది. ఇందులో బీసీసీఐకి ఎటువంటి సమస్యలు ఉండకపోవచ్చు. అంతేకాకుండా, ఇది ఈసీబీ ప్రత్యేక హక్కు” అంటూ బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
గతంలో ఇంగ్లాండ్లో భారత జట్టు టెస్ట్ పర్యటనలను పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు. దీనికి ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ, అతని కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ పేరు పెట్టారు. మార్చిలో ఈసీబీ దివంగత పటౌడీ కుటుంబానికి ట్రోఫీని రద్దు చేయాలని కోరుకుంటున్నట్లు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
ఈ సిరీస్కు ఇటీవలే పదవీ విరమణ చేసిన దిగ్గజాల పేరు పెట్టాలనేది ఈ చర్య వెనుక ఉన్న ఆలోచనగా తెలుస్తోంది. తద్వారా ప్రస్తుత తరం అభిమానులు ఈ ట్రోఫీకి మరింత కనెక్ట్ అయ్యేలా చూడవచ్చని అనుకున్నారంట.
టీమిండియా దిగ్గజ బ్యాట్స్మెన్లలో ఒకరైన టెండూల్కర్ టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు (15,921) సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 16 ఏళ్ల వయస్సులో అద్భుతమైన కెరీర్ను ప్రారంభించిన తర్వాత, అతను 24 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన, అద్భుతమైన కెరీర్ను కలిగి ఉన్న సంగతి తెలిసిందే.
అదేవిధంగా, ఆండర్సన్ స్వింగ్ బౌలింగ్ అత్యుత్తమ ప్రతిభావంతులలో ఒకడిగా పేరుగాంచాడు. ఈ ఇంగ్లీష్ పేసర్ అత్యధికంగా 704 టెస్ట్ వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్గా నిలిచాడు. స్పిన్నర్లు ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్ తర్వాత 3వ స్థానంలో నిలిచాడు.
ఆండర్సన్ టెండూల్కర్ను తొమ్మిది సందర్భాలలో అవుట్ చేసినప్పటికీ, అతను తాను బౌలింగ్ చేసిన ‘ఉత్తమ బ్యాట్స్మన్’ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.
టెండూల్కర్ పదవీ విరమణ చేసిన కొన్ని నెలల తర్వాత, 2014లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ మాజీ ప్రధాన మంత్రి రిషి సునక్ గౌరవ జాబితాలో ఆండర్సన్కు నైట్హుడ్ లభించింది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..