IND vs PAK : భారత్-పాక్ సమరానికి ముందు పెను ప్రమాదం..క్యాచ్ పడబోయి ముక్కు పగలుగొట్టుకున్న స్టార్ ప్లేయర్

IND vs PAK : ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2026లో ఆదివారం (ఫిబ్రవరి 1) జరగనున్న భారత్-పాకిస్థాన్ హై-వోల్టేజ్ పోరుకు ముందు ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బులావాయోలోని క్విన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో చిరకాల ప్రత్యర్థులు తలపడనున్న వేళ, పాకిస్థాన్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

IND vs PAK : భారత్-పాక్ సమరానికి ముందు పెను ప్రమాదం..క్యాచ్ పడబోయి ముక్కు పగలుగొట్టుకున్న స్టార్ ప్లేయర్
Ind Vs Pak

Updated on: Jan 31, 2026 | 7:21 AM

IND vs PAK : ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2026లో ఆదివారం (ఫిబ్రవరి 1) జరగనున్న భారత్-పాకిస్థాన్ హై-వోల్టేజ్ పోరుకు ముందు ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బులావాయోలోని క్విన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో చిరకాల ప్రత్యర్థులు తలపడనున్న వేళ, పాకిస్థాన్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ షాయన్ ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రంగా గాయపడి, టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. దీంతో పాక్ శిబిరంలో ఆందోళన మొదలైంది.

అండర్-19 ప్రపంచకప్ 2026లో సూపర్ సిక్స్ దశకు చేరుకున్న పాకిస్థాన్ జట్టుకు అనుకోని కష్టం వచ్చిపడింది. ఫిబ్రవరి 1న భారత్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌కు ముందు ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ షాయన్ ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. నెట్స్‌లో పేసర్ బౌలింగ్‌లో కీపింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, వేగంగా దూసుకొచ్చిన బంతి నేరుగా షాయన్ ముక్కుకు తగిలింది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, స్కాన్‌లో ముక్కు ఎముక ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. ఈ గాయం తీవ్రత దృష్ట్యా అతను టోర్నమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.

18 ఏళ్ల షాయన్ ఈ టోర్నీలో పాకిస్థాన్ తరపున రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఏడు పరుగులు చేసినా, జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. అయితే, పాక్ జట్టుకు ఒక చిన్న ఊరట ఏమిటంటే, ఆ జట్టు ఓపెనర్ హంజా జహూర్ కూడా వికెట్ కీపింగ్ చేయగలడు. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో, తదుపరి పోరాటాల్లో హంజా కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. షాయన్ స్థానంలో కొత్త ఆటగాడిని చేర్చుకోవడానికి పీసీబీ అనుమతి కోరింది.

ఈ టోర్నీలో పాకిస్థాన్ ప్రయాణం ఒడిదుడుకులతో సాగింది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయిన పాక్, ఆ తర్వాత పుంజుకుంది. స్కాట్లాండ్, జింబాబ్వే, న్యూజిలాండ్‌లపై వరుస విజయాలు సాధించి సూపర్ సిక్స్ దశకు చేరుకుంది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే భారత్‌పై పాకిస్థాన్ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఇప్పటికే టీమిండియా అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో, పాక్ ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.

మరోవైపు భారత్ అండర్-19 జట్టు గ్రూప్ దశలో అజేయంగా నిలిచి సూపర్ సిక్స్‌లో అడుగుపెట్టింది. సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే భారత్‌కు ఈ మ్యాచ్ గెలుపు ఎంతో ముఖ్యం. దాయాదుల మధ్య జరిగే పోరు కావడంతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షాయన్ దూరం కావడం పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..