ఆల్‌రౌండర్ మోజులో అసలైన వికెట్ టేకర్ బలి.. భారత్ కొంపముంచుతోన్న గంభీర్ మొండి పట్టుదల

India vs England ODI series 2026: క్రికెట్‌లో తుది జట్టు ఎంపిక ఎంత సమతుల్యంగా ఉంటే విజయ అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. కేవలం బ్యాటింగ్ లోతు కోసం స్పెషలిస్ట్ వికెట్ టేకింగ్ బౌలర్‌ను పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసమో మేనేజ్‌మెంట్ పునరాలోచించుకోవాలి. ముఖ్యంగా రాబోయే సవాళ్లను ఎదుర్కోవాలంటే గిల్-గంభీర్ ద్వయం తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆల్‌రౌండర్ మోజులో అసలైన వికెట్ టేకర్ బలి.. భారత్ కొంపముంచుతోన్న గంభీర్ మొండి పట్టుదల
Goutam Gambhir Gill Plans

Updated on: Jul 21, 2026 | 8:10 AM

India vs England ODI series 2026: ఇంగ్లాండ్‌ గడ్డపై టీమిండియా ఆశలు అడియాసలయ్యాయి. టీ20 సిరీస్‌ను కోల్పోయిన భారత్, వన్డే సిరీస్‌ను సైతం 2-1 తేడాతో ప్రత్యర్థికి అప్పగించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ ఈ ఘోర పరాజయం ఎదురవ్వడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ పరాజయం వెనుక కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న ఒక నిర్ణయమే ప్రధాన కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంగ్లాండ్ పర్యటనలో నిరాశపరిచిన ఫలితాలు..

మార్పుల పేరుతో టీ20 సిరీస్‌లో కుర్రాళ్లకు అవకాశాలిచ్చామని సమర్థించుకున్న కోచ్ గౌతమ్ గంభీర్‌కు, వన్డే సిరీస్ ఓటమి మింగుడుపడటం లేదు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకున్న భారత్, ఆ తర్వాత వరుసగా కార్డిఫ్‌లో 4 వికెట్లు, ఆఖరి నిర్ణయాత్మక మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సిరీస్ చేజారడానికి అనేక సాంకేతిక కారణాలు కనిపిస్తున్నప్పటికీ, తుది జట్టు ఎంపికలో యాజమాన్యం చూపిన మొండివైఖరే అసలు మూలమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: రోహిత్ శర్మ లేకుండానే స్వ్కాడ్.. 2027 వన్డే ప్రపంచకప్‌లో బరిలోకి దిగే భారత జట్టు ఇదే..?

ఇవి కూడా చదవండి

జట్టు మేనేజ్‌మెంట్ పట్టుదల.. అగ్రశ్రేణి స్పిన్నర్‌కు తీవ్ర అన్యాయం..!

ఈ పర్యటనలో ప్రధానంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తమకు తోచిన రీతిలోనే ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి వంటి కీలక బౌలర్లు అందుబాటులో లేని సమయంలో కూడా, ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు సాధారణంగా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తీవ్ర ఇబ్బందులు పడతారు. అటువంటి పరిస్థితులలో కుల్దీప్ వైవిధ్యమైన బౌలింగ్ భారత్‌కు కొండంత బలాన్ని ఇచ్చేది, కానీ అతనికి ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం దక్కలేదు.

ఆల్‌రౌండర్ మోజులో అసలైన వికెట్ టేకర్ బలి..

ఒకప్పుడు భారత పరిమిత ఓవర్ల జట్టులో కీలక ఆధారంగా ఉన్న కుల్దీప్ యాదవ్, ఇప్పుడు కేవలం అదనపు స్పిన్నర్ అవసరమైనప్పుడు మాత్రమే గుర్తుకొచ్చే ఆటగాడిగా మారిపోయాడు. బ్యాటింగ్ లోతును పెంచాలనే ఉద్దేశంతో మేనేజ్‌మెంట్ కేవలం స్పిన్ ఆల్‌రౌండర్లకే ప్రాధాన్యత ఇచ్చింది. దీనివల్ల తొలి రెండు వన్డేల్లో వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం దక్కింది. పోనీ మూడో వన్డేలో సుందర్ గాయం కారణంగా దూరమైనప్పుడైనా కుల్దీప్‌ను తీసుకుంటారని భావిస్తే, అప్పుడు కూడా అతనికి నిరాశే ఎదురైంది. వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టే బౌలర్ కంటే బ్యాటింగ్ చేసే బౌలర్లకే ప్రాధాన్యత ఇవ్వడం మ్యాచ్‌లను కోల్పోవడానికి దారితీసింది.

ఇది కూడా చదవండి: ఓపెనర్లుగా అభిషేక్, వైభవ్.. మిడిల్‌లో మరో డేంజరస్ ప్లేయర్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..!

గణాంకాలు చెప్తున్న నిజం..

2017లో వన్డే అరంగేట్రం చేసిన కుల్దీప్ యాదవ్ అతి తక్కువ కాలంలోనే ప్రధాన బౌలర్‌గా ఎదిగాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో 121 వన్డే మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్ 27.04 సగటుతో ఏకంగా 194 వికెట్లు పడగొట్టాడు. 5.07 తక్కువ ఎకానమీ రేట్‌తో పరుగులను కట్టడి చేయడమే కాకుండా, రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన కూడా నమోదు చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇన్ని ఘనమైన గణాంకాలు ఉన్న ఆటగాడిని సిరీస్ అంతటా బెంచ్‌కే పరిమితం చేయడం జట్టు ప్రయోజనాలను దెబ్బతీసిందనడంలో సందేహం లేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us