IPL 2026: బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన ఘోర ప్రమాదం..!

Gujarat Titans Bus Fire: మైదానంలో ట్రోఫీ చేజారిన బాధలో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఈ బస్సు ప్రమాదం మరింత మానసిక ఆందోళన కలిగించింది. అయినప్పటికీ, అదృష్టవశాత్తూ ఆటగాళ్లందరూ క్షేమంగా ఉండటంతో అటు ఫ్రాంచైజీ, ఇటు అభిమానులు పెద్ద గండం గట్టెక్కిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

IPL 2026: బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన ఘోర ప్రమాదం..!
Gujarat Titans Bus Fire

Updated on: Jun 01, 2026 | 8:33 AM

Gujarat Titans Bus Fire: ఐపీఎల్ 2026 ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత అహ్మదాబాద్ వీధుల్లో ఒక ఊహించని కలకలం రేగింది. రన్నరప్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రయాణిస్తున్న అధికారిక బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం సృష్టించింది. తృటిలో తప్పిన ఈ ఘోర ప్రమాదం నుంచి ఆటగాళ్లంతా సురక్షితంగా బయటపడటంతో క్రికెట్ ప్రపంచం ఊపిరి పీల్చుకుంది.

ఫైనల్ ఓటమి వెనుకే పెద్ద ప్రమాదం: అసలేం జరిగిందంటే?

ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నిరాశాజనక ఓటమి తర్వాత, జట్టు సభ్యులంతా కలిసి మైదానం నుంచి తిరిగి హోటల్‌కు బస్సులోబయలుదేరారు. అయితే, స్టేడియం దాటి కొద్ది దూరం వెళ్లగానే బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సులోని విద్యుత్ వ్యవస్థలో సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. చూస్తూనే ఉండగానే బస్సు లోపలి భాగమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో బస్సులో ఉన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

రోడ్డుపైనే గంటపాటు పడిగాపులు..

పరిస్థితిని గమనించిన బస్సు డ్రైవర్, సిబ్బంది తక్షణమే అప్రమత్తమయ్యారు. వాహనాన్ని పక్కకు నిలిపివేసి, ఎమర్జెన్సీ విండోల ద్వారా ఆటగాళ్లందరినీ సురక్షితంగా కిందకు దించేశారు. పొగలు కమ్ముకున్నప్పటికీ క్రికెటర్లకు ఎలాంటి గాయాలు కాకపోవడం నిజంగా పెద్ద ఉపశమనమనే చెప్పాలి.

అయితే, రాత్రి వేళ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు త్వరగా అందుబాటులోకి రాకపోవడంతో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లంతా దాదాపు గంటపాటు రోడ్డుపైనే నిలబడాల్సి వచ్చింది. ఆ తర్వాత మేనేజ్‌మెంట్ వేరొక ప్రత్యేక బస్సును రప్పించి, ఆటగాళ్లను సురక్షితంగా హోటల్‌కు చేర్చింది.

అలసట వల్లే ఫైనల్‌లో ఓడిపోయారా?

గుజరాత్ టైటాన్స్ జట్టుకు గత కొన్ని రోజులుగా ప్రయాణాలు శాపంగా మారాయి. మే 27న ధర్మశాల నుంచి ముల్లాన్‌పూర్‌కు ప్రయాణించి, మే 29న రాజస్థాన్ రాయల్స్‌తో క్వాలిఫైయర్-2 ఆడాల్సి వచ్చింది. ఆ తర్వాత మే 30న అహ్మదాబాద్ చేరుకోవాల్సిన షెడ్యూల్ ఉన్నప్పటికీ, ముల్లాన్‌పూర్‌లో వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం తీవ్రంగా ఆలస్యమైంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాతే జట్టు అహ్మదాబాద్ చేరుకుంది.

వరుస ప్రయాణాలు, నిద్రలేమి, తీవ్రమైన అలసట వల్లే గుజరాత్ జట్టు ఫైనల్‌లో కేవలం 155 పరుగులకే పరిమితమైందా? అనే ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై గుజరాత్ టైటాన్స్ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“వరుస మ్యాచ్‌లు, ప్రయాణాల వల్ల ఆటగాళ్లు అలసిపోయిన మాట నిజమే. కానీ, దాన్ని నెపంలా చూపిస్తూ బెంగళూరు జట్టు సాధించిన అద్భుత విజయాన్ని మేం తక్కువ చేయాలనుకోవడం లేదు. మేం తక్కువ పరుగులకే పరిమితమైనప్పటికీ, మా బౌలర్లు చివరి వరకు గట్టిగా పోరాడారు. కొన్నిసార్లు ప్రత్యర్థి జట్టు మనకంటే బాగా ఆడినప్పుడు దాన్ని అంగీకరించక తప్పదు” అని సోలంకి పేర్కొన్నారు.

మైదానంలో ట్రోఫీ చేజారిన బాధలో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఈ బస్సు ప్రమాదం మరింత మానసిక ఆందోళన కలిగించింది. అయినప్పటికీ, అదృష్టవశాత్తూ ఆటగాళ్లందరూ క్షేమంగా ఉండటంతో అటు ఫ్రాంచైజీ, ఇటు అభిమానులు పెద్ద గండం గట్టెక్కిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us