AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: చిన్న జట్లపై గెలిచి ఎగిరిపడటం కాదు.. టీమిండియా హెడ్ కోచ్‌కి మాజీ కెప్టెన్ వార్నింగ్

Team India: శ్రీలంకతో రెండో టెస్టులో దేవదత్ పడిక్కల్ వరుసగా రెండో సెంచరీతో అదరగొట్టడంతో మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు టెస్టుల్లో 200కుపైగా పరుగులు చేసిన పడిక్కల్‌ను ఎలా పక్కన పెడతారని గౌతమ్ గంభీర్‌ను ప్రశ్నించారు. చిన్న జట్లపై విజయాలతో ఎగిరిపడటం కాదంటూ హెడ్ కోచ్‌కు ఘాటు వార్నింగ్ ఇచ్చారు.

Team India: చిన్న జట్లపై గెలిచి ఎగిరిపడటం కాదు.. టీమిండియా హెడ్ కోచ్‌కి మాజీ కెప్టెన్ వార్నింగ్
Gautam Gambhir
Rakesh
|

Updated on: Aug 24, 2026 | 11:26 AM

Share

Team India: శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో దేవదత్ పడిక్కల్ అద్భుత సెంచరీతో మెరిశాడు. అదే సమయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పడిక్కల్ వరుసగా రెండు టెస్టుల్లోనూ 200 పైచిలుకు పరుగులు సాధించిన తర్వాత కూడా అతడి స్థానంపై అనుమానాలు వ్యక్తం చేయడం ఏంటని శ్రీకాంత్ ప్రశ్నించారు. శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ లాంటి బలహీన జట్లపై మ్యాచ్‌లు గెలిచి గంభీర్ ఎగిరిపడతారని, ఈ సిరీస్‌లో అసలు కోచ్‌కి పెద్దగా పనేం లేదని ఘాటుగా విమర్శించారు.

కొలంబో టెస్టు తొలిరోజే కర్ణాటక బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 117 పరుగుల అద్భుత శతకంతో జట్టును ఆదుకున్నారు. తొలి టెస్టులో 167 పరుగులు చేసిన పడిక్కల్, గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చి వరుసగా రెండో సెంచరీ నమోదు చేశారు. అయితే నంబర్ 3 స్థానంలో సుదర్శన్‌కే సుదీర్ఘ కాలం మద్దతు ఇస్తామని గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు టెస్టుల్లో కలిపి 200 పైచిలుకు పరుగులు చేసిన ప్లేయర్‌ను మున్ముందు ఎలా పక్కన పెడతారని ఆయన నిలదీశారు.

శ్రీలంక లాంటి జట్లపై గెలిస్తే గొప్పేంటి?

ఈ సిరీస్ గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ.. శ్రీలంక చాలా బలహీనమైన జట్టు అని, అక్కడ భారత్ సునాయాసంగా గెలుస్తుందని చెప్పారు. శ్రీలంక లేదా ఆఫ్ఘనిస్థాన్ లాంటి చిన్న జట్లపై సిరీస్ గెలిచిన తర్వాత గంభీర్ ఎగిరిపడుతుంటారని ఎద్దేవా చేశారు. గంభీర్‌పై తనకు వ్యక్తిగత కక్ష ఏమీ లేదని, ఆయన మంచి ఆటగాడు, క్రికెట్ తెలిసిన వ్యక్తి అయినప్పటికీ కమ్యూనికేషన్ విషయంలో ఇంకా స్పష్టత ఉండాలని హితవు పలికారు.

గ్రౌండ్‌లో పడిక్కల్ సెంచరీ జోరు

మరోవైపు తొలిరోజు ఆటలో పడిక్కల్ 193 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేశారు. మ్యాచ్ ప్రారంభంలోనే రెండు సులువైన క్యాచ్‌లను శ్రీలంక ఫీల్డర్లు చేజార్చడంతో వచ్చిన అవకాశాన్ని పడిక్కల్ చక్కగా ఉపయోగించుకున్నారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి మూడో వికెట్‌కు 120 పరుగులు, రవీంద్ర జడేజాతో కలిసి నాలుగో వికెట్‌కు 74 పరుగుల విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పారు. దేవదత్ పడిక్కల్ వరుస సెంచరీలతో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుని మేనేజ్‌మెంట్‌కు సవాల్ విసిరాడు. శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్ వర్గాల్లో వేడి పుట్టిస్తుండటంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తులో సెలెక్షన్ విషయంలో ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us