T20 World Cup 2021: భారత్ ఓటమిపై మాజీ క్రికెటర్ల ఆగ్రహం.. ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరిచారంటూ ట్వీట్లు..

|

Nov 01, 2021 | 7:12 PM

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 సూపర్ 12లో న్యూజిలాండ్‎తో ఆదివారం జరిగిన మ్యాచ్‎లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీం ఇండియా మరో ఘోర పరాజయాన్ని చవిచూసింది. గత ఆదివారం బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్తాన్ చేతిలో కూడా ఇండియాకు పరాభవం ఎదురైంది...

T20 World Cup 2021: భారత్ ఓటమిపై మాజీ క్రికెటర్ల ఆగ్రహం.. ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరిచారంటూ ట్వీట్లు..
Kohli
Follow us on

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 సూపర్ 12లో న్యూజిలాండ్‎తో ఆదివారం జరిగిన మ్యాచ్‎లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీం ఇండియా మరో ఘోర పరాజయాన్ని చవిచూసింది. గత ఆదివారం బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్తాన్ చేతిలో కూడా ఇండియాకు పరాభవం ఎదురైంది. దీంతో విరాట్ సేనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్‎తోపాటు మాజీ క్రికెటర్లు మరియు క్రికెట్ పండితులు కివీస్ చేతిలో ఓటమిపై నిరాశను వ్యక్తం చేశారు. న్యూజిలాండ్‎తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి నేతృత్వంలోని టీమ్ ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైన తర్వాత సెహ్వాగ్ ట్విట్టర్‎లో స్పందించారు. భారత బ్యాటర్ల పేలవమైన షాట్ ఎంపికను తప్పుబట్టాడు. “భారత జట్టు చాలా నిరుత్సాహపరిచింది. కివీస్ అద్భుతంగా ఆడింది. ఇండియా ఆటగాళ్ల తీరు గొప్పగా లేదు. భారత్ తదుపరి దశకు చేరుకోలేదని న్యూజిలాండ్ గెలుపు నిర్ధారించింది. ఇది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

మాజీ భారత ఆల్ రౌండర్ పఠాన్ భారత్ ఓటమిపై స్పందించాడు. విలియమ్సన్ అండ్ కోని అభినందించాడు. ” ఆటగాళ్లకు స్థిరత్వం అవసరమని” పఠాన్ ట్వీట్ చేశాడు. ఇండియా, కివీస్ మ్యాచ్‎పై మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, వసీం జాఫర్, ఆకాశ్ చోప్రా, భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా స్పందించారు.

ఈ మ్యాచ్‎లో భారత్ ఆటపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ విమర్శలు గుప్పించారు. “భారత్ ఈ T20 వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించేలా ఉందన్నారు. ఇంత ప్రతిభ ఉండి, పెద్ద జట్టుగా పేరొందిన టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దారుణంగా విఫలమవుతుందని ట్వీట్ చేశాడు. ప్రపంచంలోని ఇతర దేశాల్లో నిర్వహిస్తున్న అన్ని లీగ్‌ మ్యాచ్‌లలో ఆడేందుకు భారత క్రికెటర్లకు అనుమతినివ్వాలని బీసీసీఐకి మైకేల్‌ వాన్‌ సూచించాడు. తద్వారా వారికి అనుభవం వస్తుందన్నారు.

మరో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు పీటర్సన్ టీం ఇండియాకు మద్దతుగా నిలిచాడు. “క్రీడలలో గెలుపు, ఓటములు ఉంటాయి. ఏ ఆటగాడు ఓడిపోవడానికి ఆట ఆడడు. మీ దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం. క్రీడాకారులు రోబోలు కాదని, వారికి అన్ని సమయాల్లో మద్దతు అవసరమని దయచేసి గ్రహించండి.” అంటూ ట్వీట్ చేశాడు.

Read Also.. VVS Laxman Birthday: జట్టుకు ఆపద్భాంధవుడతడు.. అతను ఆడిన ఆ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది..