
IPL 2026 Player Loan Rules : ఐపీఎల్ 2026 సీజన్లో ఆటగాళ్ల గాయాలు ఫ్రాంచైజీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. తాజాగా ఈ సెగ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు కూడా తగిలింది. జట్టు స్టార్ ఓపెనర్ ఆయుష్ మ్హాత్రే గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కావడం సీఎస్కేను కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ సీజన్లో కేవలం 6 మ్యాచ్ల్లోనే 201 పరుగులు చేసి అదరగొడుతున్న మ్హాత్రే స్థానాన్ని ఎలా భర్తీ చేయాలనే దానిపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక ఆసక్తికరమైన సలహా ఇచ్చారు. అదే ప్లేయర్ లోన్ పద్ధతి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బెంచ్పై ఉన్న అభిజ్ఞాన్ కుందును లోన్ కింద తీసుకోవాలని అశ్విన్ సూచించారు. అసలు ఐపీఎల్లో ఒక జట్టు ప్లేయర్ను మరో జట్టు అప్పుగా తీసుకోవచ్చా? ఆ రూల్స్ ఏంటో వివరంగా తెలుసుకుందాం.
ఏమిటీ ప్లేయర్ లోన్ పద్ధతి?
ఐపీఎల్లో ఈ లోన్ సిస్టమ్ 2018లో కేవలం అన్క్యాప్డ్ ప్లేయర్ల (అంతర్జాతీయ మ్యాచ్లు ఆడని వారు) కోసం మొదలైంది. అయితే 2019 నుంచి దీనిని క్యాప్డ్ ప్లేయర్లకు కూడా వర్తింపజేశారు. ఒక జట్టులో ఉండి వరుసగా అవకాశాలు రాని ఆటగాళ్లను, అవసరమున్న మరో జట్టుకు అప్పుగా ఇవ్వడమే ఈ రూల్ ఉద్దేశం. ప్రస్తుతం ఆయుష్ మ్హాత్రే స్థానంలో ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తున్న సీఎస్కేకు, ఆర్సీబీ వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు బెస్ట్ ఆప్షన్ అని అశ్విన్ అభిప్రాయపడ్డారు.
లోన్ సిస్టమ్ వెనుక ఉన్న రూల్స్ ఇవే:
ప్లేయర్ను లోన్ తీసుకోవడం అంత సులభం కాదు. దీనికి కొన్ని కఠినమైన షరతులు ఉన్నాయి:
ట్రిపుల్ అగ్రిమెంట్: ఆటగాడిని కొనుగోలు చేసిన టీమ్ (RCB), లోన్ తీసుకోవాలనుకుంటున్న టీమ్ (CSK), ఆ ఆటగాడు (అభిజ్ఞాన్).. ఈ ముగ్గురూ అంగీకరిస్తేనే ఈ డీల్ కుదురుతుంది.
మ్యాచ్ల పరిమితి: లోన్ ఇవ్వబోయే ఆటగాడు తన మాతృ జట్టు తరపున ఆ సీజన్లో కేవలం 2 లేదా అంతకంటే తక్కువ మ్యాచ్లు ఆడి ఉండాలి. అంతకంటే ఎక్కువ ఆడితే లోన్ ఇవ్వడానికి వీలుండదు.
ఒక్క సీజన్ మాత్రమే: లోన్ మీద వెళ్ళిన ఆటగాడు ఆ సీజన్ చివరి వరకు మాత్రమే కొత్త జట్టులో ఉంటాడు. ఐపీఎల్ 2027 నాటికి మళ్ళీ ఆర్సీబీకే తిరిగి రావాలి.
సొంత జట్టుతో మ్యాచ్ ఆడకూడదు: ఒకవేళ అభిజ్ఞాన్ సీఎస్కేలోకి వెళ్తే.. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మ్యాచ్ జరిగినప్పుడు మాత్రం ఆయన ఆడేందుకు అనుమతి ఉండదు.
అశ్విన్ సలహా ఎందుకు ముఖ్యం?
ఐపీఎల్ 2026లో లోన్ విండో 7వ మ్యాచ్ ముగిసే సమయానికి క్లోజ్ అవుతుంది. ఆ లోపే సీఎస్కే ఈ నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ లోన్ పద్ధతి కాకుండా రీప్లేస్మెంట్ ప్లేయర్ను తీసుకోవాలంటే అక్షర క్రమంలో ఉన్న జాబితా నుంచి ఎంచుకోవాలి. కానీ లోన్ పద్ధతి ద్వారా ఇప్పటికే ఐపీఎల్ వాతావరణంలో ఉన్న ప్లేయర్ దొరుకుతారు కాబట్టి జట్టుకు వెంటనే ఉపయోగపడతారు. అభిజ్ఞాన్ కుందు లాంటి టాలెంటెడ్ ప్లేయర్ వస్తే ఓపెనింగ్ సమస్య తీరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సీఎస్కే నిర్ణయంపై ఉత్కంఠ
ప్రస్తుతం సీఎస్కే మేనేజ్మెంట్ దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ ఆర్సీబీ, అభిజ్ఞాన్ దీనికి ఓకే చెబితే, ఐపీఎల్ చరిత్రలోనే ఇదొక అతిపెద్ద మిడ్-సీజన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అభిమానులు కూడా ఆర్సీబీ ప్లేయర్ చెన్నై జెర్సీలో ఎలా ఆడతాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గాయాలతో సతమతమవుతున్న ధోనీ సేనకు ఇదొక సంజీవని లాంటి వార్త అనే చెప్పాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..