ట్రై సిరీస్‌కు టీమిండియా స్వ్కాడ్.. కెప్టెన్‌గా తెలుగబ్బాయ్.. సూర్యవంశీతోపాటు 15మంది ఐపీఎల్ తోపులు..!

India A Squad: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతిష్టాత్మకమైన త్రైపాక్షిక సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత్ 'ఏ' జట్టును ప్రకటించింది. ఈ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చోటు దక్కించుకోవడం విశేషం. తెలుగు తేజం తిలక్ వర్మ సారథ్యంలో ఈ యువ జట్టు శ్రీలంక గడ్డపై సత్తా చాటేందుకు సిద్ధమైంది.

ట్రై సిరీస్‌కు టీమిండియా స్వ్కాడ్.. కెప్టెన్‌గా తెలుగబ్బాయ్.. సూర్యవంశీతోపాటు 15మంది ఐపీఎల్ తోపులు..!
India A Squad

Updated on: May 14, 2026 | 7:01 PM

India A Squad: శ్రీలంక ఆతిథ్యమిస్తున్న ఈ త్రైపాక్షిక సిరీస్‌లో భారత్ ‘ఏ’, శ్రీలంక ‘ఏ’, ఆఫ్ఘనిస్తాన్ ‘ఏ’ జట్లు తలపడనున్నాయి. జూన్ 9వ తేదీన ప్రారంభమయ్యే ఈ టోర్నీ 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరగనుంది. ఐపీఎల్ 2026 ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే ఈ సిరీస్ ప్రారంభం కానుండటం గమనార్హం. దంబుల్లా వేదికగా మొత్తం ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయి.

సంచలన నిర్ణయాలు: వైభవ్ రాక.. ప్రిన్స్ యాదవ్‌కు నిరాశ..

బీసీసీఐ ప్రకటించిన ఈ జట్టులో అత్యంత చర్చనీయాంశమైన పేరు వైభవ్ సూర్యవంశీ. బీహార్‌కు చెందిన ఈ 13 ఏళ్ల కుర్రాడు ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు భారత్ ‘ఏ’ జట్టులో చోటు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే, ఐపీఎల్‌లో 16 వికెట్లతో అదరగొట్టిన ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్‌కు ఈ జట్టులో చోటు దక్కకపోవడం చర్చకు దారితీసింది. అతనికి బదులుగా యశ్ ఠాకూర్, యుద్ధవీర్ సింగ్, అర్షద్ ఖాన్‌లను సెలెక్టర్లు ఎంపిక చేశారు.

బలమైన బ్యాటింగ్, బౌలింగ్ విభాగం..

జట్టు సారథిగా తిలక్ వర్మ వ్యవహరిస్తుండగా, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతారు. ఓపెనర్లుగా ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ బరిలోకి దిగనున్నారు. బౌలింగ్ విభాగంలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున డెత్ ఓవర్లలో అద్భుతంగా రాణించిన అన్షుల్ కాంబోజ్ జట్టుకు ప్రధాన ఆకర్షణగా మారనున్నాడు. ఆల్ రౌండర్ల విభాగంలో ఆయుష్ బదోని, నిశాంత్ సింధు వంటి ప్రతిభావంతులు ఉన్నారు.

భారత్ ‘ఏ’ పూర్తి జట్టు వివరాలు: తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, హర్ష్ దూబే, సూర్యాన్ష్ షెడ్జ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్), విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుద్ధవీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్.

షెడ్యూల్ వివరాలు (జూన్ 2026):

ట్రై సిరీస్ అనంతరం భారత్ ‘ఏ’, శ్రీలంక ‘ఏ’ జట్ల మధ్య గాలే వేదికగా రెండు రోజుల (మల్టీ-డే) మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి.

జూన్ 9: భారత్ ‘ఏ’ వర్సెస్ శ్రీలంక ‘ఏ’

జూన్ 11: భారత్ ‘ఏ’ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ‘ఏ’

జూన్ 15: భారత్ ‘ఏ’ వర్సెస్ శ్రీలంక ‘ఏ’

జూన్ 17: భారత్ ‘ఏ’ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ‘ఏ’

జూన్ 21: ఫైనల్ మ్యాచ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us