Babar Azam : బాబర్ కెరీర్ ముగిసినట్టేనా? నమీబియా మ్యాచ్‌లో పాక్ తీసుకున్న నిర్ణయంతో ఫ్యాన్స్ ఫుల్ సీరియస్!

Babar Azam : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు మేనేజ్మెంట్ తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ బాబర్ ఆజం తుది జట్టులో ఉన్నప్పటికీ, అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం కల్పించకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది

Babar Azam : బాబర్ కెరీర్ ముగిసినట్టేనా? నమీబియా మ్యాచ్‌లో పాక్ తీసుకున్న నిర్ణయంతో ఫ్యాన్స్ ఫుల్ సీరియస్!
Babar Azam Vs Namibia

Updated on: Feb 18, 2026 | 6:06 PM

Babar Azam : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు మేనేజ్మెంట్ తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ బాబర్ ఆజం తుది జట్టులో ఉన్నప్పటికీ, అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం కల్పించకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. సాధారణంగా టాప్ ఆర్డర్‌లో వచ్చే బాబర్‌ను పక్కన పెట్టి, ఇతర ఆటగాళ్లను ప్రమోట్ చేయడం వెనుక పాక్ మేనేజ్మెంట్ ఒక పక్కా వ్యూహాన్ని అమలు చేసినట్లు కనిపిస్తోంది.

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ భారీ స్కోరు సాధించడమే కాకుండా, సెమీస్ రేసులో కీలకంగా మారే నెట్ రన్ రేట్‌ను వీలైనంత మెరుగుపరుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే బాబర్ ఆజం ఈ టోర్నీలో కేవలం 111.80 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేస్తుండటం జట్టుకు మైనస్‌గా మారింది. ఈ మందకొడి బ్యాటింగ్ స్టైల్ టీ20 ప్రమాణాల ప్రకారం సరిపోదని భావించిన మేనేజ్మెంట్, స్ట్రైక్ రేట్ పెంచేందుకే అతడిని బ్యాటింగ్‌కు పంపలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. సాహిబ్‌జాదా ఫర్హాన్, సల్మాన్ ఆగా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్న సమయంలో అదే జోరును కొనసాగించేందుకు బాబర్ స్థానంలో హిట్టర్లైన ఖ్వాజా నఫే, షాదాబ్ ఖాన్‌లను క్రీజులోకి పంపడం ఒక వ్యూహాత్మక మార్పుగా మారింది.

పాక్ అనుకున్నట్లుగానే షాదాబ్ ఖాన్ మైదానంలోకి రావడంతోనే 163 స్ట్రైక్ రేట్‌తో 36 పరుగులు చేసి జట్టు స్కోరును 199కి చేర్చాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, బాబర్ ఆజం డగౌట్‌లో ప్యాడ్లు కట్టుకుని, బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్‌కు రావడానికి సర్వం సిద్ధంగా ఉన్నప్పటికీ అతనికి ఆ ఛాన్స్ రాలేదు. కెప్టెన్, కోచ్ తీసుకున్న ఈ టాక్టికల్ నిర్ణయం నెట్ రన్ రేట్ పరంగా ఫలితాన్ని ఇచ్చినప్పటికీ, ఒక స్టార్ ఆటగాడిని ఇలా పక్కన పెట్టడం పట్ల సోషల్ మీడియాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

మరోవైపు, బాబర్ ఆజం బ్యాటింగ్‌కు రాకపోయినా ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ మాత్రం నమీబియా బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 58 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారత్‌తో జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్‌లో డకౌట్ అయిన ఫర్హాన్, ఈ సెంచరీతో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ద్వారా అతను టీమిండియా ఓపెనర్ ఈషాన్ కిషన్‌ను వెనక్కి నెట్టి, ఈ వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఫర్హాన్ ఫామ్ ఇప్పుడు పాక్ జట్టుకు కొండంత బలాన్ని ఇస్తోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us