
ఇటీవల జరిగిన T20 ప్రపంచకప్ టోర్నమెంట్లో టీమిండియా విజేతగా నిలిచి ప్రస్తుతం మంచి ఫామ్లో ఉంది. బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉన్నప్పటికీ, బౌలింగ్లో అప్పుడప్పుడు బలహీనతలు కనిపిస్తున్నాయి. పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం జట్టుకు ఎల్లప్పుడూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2024, 2026 T20 వరల్డ్కప్లలో బుమ్రా బౌలింగ్ టీం ఇండియా టైటిల్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించింది. అయితే, భవిష్యత్తులో టీమిండియాకు బుమ్రా తర్వాత ఎవరు కీలకం అవుతారనే దానిపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
బుమ్రా స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరని అశ్విన్ స్పష్టం చేశారు. వైట్ బాల్ క్రికెట్లో టీమిండియా బ్యాటింగ్ భవిష్యత్తులో బలంగా ఉంటుందని, రానున్న దశాబ్దంలో ట్రోఫీలు గెలుచుకుంటుందని అశ్విన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, బౌలింగ్ విభాగంపైనే తనకు ఆందోళన ఉందని తెలిపారు. బ్యాటింగ్ ఉన్నంత ఆకర్షణీయంగా బౌలింగ్ లేకపోవడం వల్ల యువతరంలో పిల్లలు బౌలింగ్ను ఎంచుకోకపోవచ్చని ఆయన అన్నారు. బ్యాటర్లు కొట్టే సిక్సర్లు, ఫోర్లు యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయని.. టోర్నమెంట్లు, సిరీస్లు గెలవడానికి బౌలింగ్ కీలకమని ఎవరూ గుర్తించడం లేదని అశ్విన్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తు బౌలింగ్ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని, దీంతో టీం ఇండియాకు బుమ్రా లాంటి బౌలర్ ఎలా వస్తాడని అశ్విన్ ప్రశ్నించారు.